CM Revanth Reddy visit to Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బజార్‌హత్నూర్ మండలం  పిప్రి  గ్రామంలో నిర్వహించిన  ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక  బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు  1,238 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్‌ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతం ఇకపై వెనుకబడిన జిల్లాగా ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన పర్యటనను బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనంతో ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కోసం 225 కోట్లతో  చేపట్టిన విస్తరణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. తన మనవడికి అక్కడే అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పిప్రి సభలో మాట్లాడారు. నిర్మల్, బోథ్ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా, రాజకీయాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసమే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ రైతాంగం చిరకాల స్వప్నమైన  తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అలాగే, ఆదిలాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద  పారిశ్రామిక కేంద్రంగా  తీర్చిదిద్దేందుకు భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, తద్వారా స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు అయిన  ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు  గురించి ముఖ్యమంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పటికే అనుమతులు సాధించామని, వీలైతే  జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేస్తామని ప్రకటించారు. దీనితో పాటు ఆదిలాబాద్‌లో ఒక  యూనివర్సిటీ  ఏర్పాటుకు భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే దానికి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి రెండు నెలలకోసారి జిల్లాకు వచ్చి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,  10,000 కోట్లతో అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటికే 5,400 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని ధైర్యంగా చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, తాము పాలకులం కాదు ప్రజల సేవకులమని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.  

Continues below advertisement

Continues below advertisement