Telangana Municipal Elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరోక్షంగా ఒక్కటయ్యాయని, ఆ రెండు పార్టీల మధ్య అపవిత్ర కలయిక ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అక్రమాల నుంచి వారిని కాపాడేందుకు బీజేపీ నేతలు భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, పరస్పర ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయని, అందుకే బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ.. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తమ అక్రమ సంపాదనను బీజేపీ నేతలకు చేరవేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా బీజేపీ ప్రభుత్వం వారిపై ఎలాంటి విచారణ జరగకుండా అడ్డుకుంటుందని ఆయన విశ్లేషించారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజల సొమ్మును కక్కిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కాళేశ్వరం రిపోర్టు పంపి ఆరు నెలలు అయినా చర్యలు తీసుకోలేదన్నారు.
బీజేపీ ఎంపీలు, నేతలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని, తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల గురించి కేంద్రం వద్ద నోరు మెదపడం లేదని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్తో ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కూడా రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. అక్షింతలు వేసే వారు ఒకవైపు, అభివృద్ధి చేసే వారు మరొకవైపు ఉన్నారని.. ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులను తీర్చుకుంటూనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ సమ్మక్క జాతరకు హాజరు కాలేదన్నారు. గతంలో భద్రాచలం వి,యంలోనూ అలాగే చేశారని అన్నారు.
