KCR Comments: ఆంధ్రాలో చిమ్మచీకటి, తెలంగాణ వెలిగిపోతోంది - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ABP Desam Updated at: 06 Jun 2023 07:44 PM (IST)

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ మాట్లాడారు.

సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

NEXT PREV

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటి అయిపోతుందని అప్పట్లో అందరూ అన్నారని, ఇప్పుడు రాష్ట్రంలో వెలుగు జిలుగులు ఉన్నాయని అన్నారు. ఆంధ్రాలో చిమ్మ చీకటి ఉంటే, తెలంగాణ వెలిగిపోతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ మాట్లాడారు.


ఓ ప్రబుద్ధుడు ధరణి పోర్టల్‌ను తీసేస్తామన్నాడని, గంగలో కలిపేస్తామన్నాడని కేసీఆర్ గుర్తు చేశారు. గతంలో భూ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే నాలుగైదు రోజులు పట్టేది. ఎంతో డబ్బు ఖర్చయ్యేది. ఇంతకుముందు భూముల రిజిస్ట్రేషన్లు మార్చాలంటే, అధికారుల చేతుల్లోనే అంతా ఉండేది. ధరణి వచ్చాక భూ రిజిస్ట్రేషన్ మరొకరి పేరుపైకి రాసే హక్కు వీఆర్వో నుంచి సీఎం వరకూ ఎవరికీ లేదని చెప్పారు. భూమి ఉన్న రైతు వేలి ముద్ర పెడితేనే అతని అంగీకారంతోనే మరొకరి పేరు మీదకి భూమి మార్చే అవకాశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లో పూర్తి అయిపోతోందని అన్నారు. ధరణి లేకపోతే రైతు బంధు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అన్ని వివరాలు కంప్యూటర్ లో ఉన్నాయి కాబట్టి, ధాన్యం అమ్మకం తర్వాత ఆటోమేటిగ్గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని అన్నారు.



కడుపులో సల్ల కదలకుండానే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అకౌంట్లలోకి వస్తున్నయ్. ఇలాంటి సదుపాయాలు ఉన్న ధరణిని తీసేయాలా? తీసేయాలా? ధరణి కావాలనుకునే వారు చేతులు ఎత్తండి. ఇలాంటి ధరణిని తీసేస్తామని విపక్షాల వారు అంటున్నరు. మీరు మీ ఊరికి వెళ్లి ఆలోచన చెయ్యండి. ధరణి తీసేస్తే మొత్తం ఆగంఆగం అయిపోతది. ధరణితో 99 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయి. ధరణి లేకపోయి ఉంటే ఎన్ని పంచాయతీలు ఉంటుండె? ఎన్ని కేసులు ఉండేవి?- కేసీఆర్


‘‘పాలు కారిన పాలమూరులో కరవును తట్టుకోలేక ఒకప్పుడు గంజి కేంద్రాలు పెట్టారు. అలాంటి పాలమూరు జిల్లాలో ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలిశాయి. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యం అయింది. ఇంతకుముందు రెండు పార్టీలు కాంగ్రెస్, టీడీపీ పరిపాలించాయి. ఆ ముఖ్యమంత్రులు కనీసం పాలమూరుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల ప్రతి ఇంటికి మంచినీరు అందుతూ ఉంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని కాలేజీలు వస్తయని మనం కలకన్నమా? ఇప్పుడు వేరే వాళ్లు సభలు పెట్టి అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు.’’


ఉద్య‌మ చ‌రిత్ర‌లో పాల‌మూరు జిల్లా పేరు శాశ్వ‌తం


‘‘తెలంగాణ రాక‌పోయి ఉంటే నాగ‌ర్‌ క‌ర్నూల్ జిల్లా అవ్వక‌పోయేది. ఎస్పీ, క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలు వ‌చ్చేది కాదు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో చాలా వెనుక‌బాటు త‌నం ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. సాగు, తాగునీటికి , క‌రెంట్‌కు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇవ‌న్నీ అర్థం కావాలంటే పాల‌మూరు ఎంపీగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. జ‌య‌శంక‌ర్ సార్ సూచ‌న మేర‌కు పాల‌మూరు ఎంపీగా పోటీ చేసి గెలిచాను. ఆ రోజు వాస్తవంగా పాల‌మూరు జిల్లాలో ఉద్యమం బ‌లంగా లేదు. కానీ మీరు చూపించిన ఆద‌ర‌ణ‌తో ఎంపీగా గెలిపించారు. ఉద్య‌మ చ‌రిత్ర‌లో పాల‌మూరు జిల్లా పేరు శాశ్వ‌తంగా ఉంటుంది. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్ర‌త్యేక రాష్ట్రాన్ని కూడా సాధించాను. ఈ జిల్లాను ఎప్ప‌టికీ మ‌రిచిపోను’’ అని కేసీఆర్ మాట్లాడారు.

Published at: 06 Jun 2023 07:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.