హైదరాబాద్: పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య మృతిపట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు, మంత్రులు, ఇతర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పలు రంగాల ప్రముఖులు వనజీవి రామయ్య లేనిలోటు పూడ్చలేనిది అంటున్నారు. పర్యావరణం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటున్నారు.
 
పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మొక్కలు నాటి వనజీవినే… తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం..
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారానికి లోనయ్యారు. ఒక వ్యక్తిగా ఉండి... పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకం అన్నారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
 
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికారు..

వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు అని, తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని వనజీవి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి  రామయ్య మృతిపట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి  రక్షితః " అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.

ప్రపంచ  పర్యావరణ  కోసం సాగిన మానవ కృషిలో వనజీవి గా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదని అన్నారు. అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణ కు హరిత హారం... ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.  భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావనీ కేసీఆర్ పునరుద్ఘాటించారు.

 పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ  వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.