BRS senior leaders  :  భారత రాష్ట్ర సమితి నేతలకు పెద్ద కష్టం వచ్చింది. వారిపై రోజూ ..  పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ నేతలు మీడియా ముందుకు వచ్చి తమపై తప్పుడు  ప్రచారం చేస్తున్నారని పార్టీ మారే ఉద్దేశం లేదని అంటున్నారు. అయితే రోజుకో సీనియర్ నేత  పార్టీకి గుడ్ బై చెబుతూండటంతో వారి మాటలను అనుమానాస్పదంగానే చూస్తున్నారు. తాజాగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు. 


అయోధ్యకు వెళ్లాను.. బీజేపీలో చేరడానికి కాదు : శ్రీనివాస్ గౌడ్ 
 
తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరుతున్నాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. అయోధ్య గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్టా అని ప్రశ్నించారు. తానేంటో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు తెలుసని అన్నారు. కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లొంగలేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బహుజనుల కోసం పోరాడుతుందనే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీలోకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌ పార్టీలా దేశంలో బహుజనుల కోసం పోరాడిన పార్టీ ఉన్నదా అని ఆయన ప్రశ్నించారు.


బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదన్న ఎర్రబెల్లి 
 
బీఆర్ఎస్ పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్‌ను వీడే ప్ర‌స‌క్తే లేదు..పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయ‌న తేల్చిచెప్పారు. వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థి క‌డియం కావ్య‌తో క‌లిసి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇత‌ర పార్టీల్లోకి వెళ్లే ముచ్చ‌ట‌నే లేద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నాను. బీఆర్ఎస్ పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాను. ప్ర‌తిప‌క్షంలో కూడా ప‌ని చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. చాలా మంది సీఎంల‌ను కూడా ఎదుర్కొన్నాను. పార్టీలోకి రాక‌పోతే వ‌ర్ధ‌న్న‌పేట‌ను ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ చేస్తాను.. ఎక్క‌డ పోటీ చేయ‌నివ్వ‌కుండా చేస్తాన‌ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి బెదిరించారు. ఎంపీగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కూడా పార్టీలో చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కానీ త‌న‌ను పాల‌కుర్తి ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించి గెలిపించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్‌ను వీడే ప్రస‌క్తే లేదన్నారు. 


ప్రాంతీయ పార్టీలను కబళిస్తున్నారని బీజేపీపై బీఆర్ఎస్ ఆగ్రహం  


ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.  రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడం మోదీకి అలవాటు అని విమర్శించారు. వందల ప్రాణాలను బలి తీసుకున్న మోదీకి కవితను జైలుకు పంపించడం చిన్న విషయమని అన్నారు. వ్యతిరేకించిన వారిని ఇబ్బంది పెట్టడమే మోదీ నైజమని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారు పవిత్రులైపోతున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్ర జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ వచ్చే ముందు ఈడీ, సీబీఐ వస్తాయని విమర్శించారు. మోదీ పాలన దేశం భ్రష్టు పట్టిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.