Harish Rao open letter to Telangana CM Revanth Reddy |హైదరాబాద్: గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అన్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపకపోగా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారని ఎద్దేవా చేశారు. అభ్యర్థులు, నిరుద్యోగులకు ఉపశమనం కలిగించే మాట చెప్పలేదు, సమస్యకు పరిష్కారం చూపలేదని లేఖలో రాసుకొచ్చారు హరీష్ రావు.


కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 
‘ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్ల నిరుద్యోగుల పోరాటం మొదలైందని గుర్తుంచుకోవాలి. ‘మావి కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నేరవేర్చాలని రిక్వెస్ట్ మాత్రమే. రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే’ అని అభ్యర్థులు, నిరుద్యోగులు చెబుతంటూ ప్రభుత్వం పరిష్కారం కోసం ఎందుకు ఆలోచించడం లేదు. మీరు, మంత్రులు, అధికారులు కలిసి ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దౌర్భాగ్యం. ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఇనుపకంచెలు వేయడం, ముందస్తు అరెస్టులు, ఎక్కడిక్కడ నిర్బంధాలు అప్రజాస్వామికం. జర్నలిస్టులను సైతం బెదిరించడం, అరెస్టులు చేయడం, వారిపై దాడులు చేయడం హేయమైన చర్య. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అరెస్టు అయిన వారిని విడుదల వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు.


‘సాకులు చెప్పి తప్పించుకుంటే అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదు. నిరాహార దీక్షలు చేస్తున్న వారు పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడమే. ఉద్యోగ సమస్యలపై పోరాటం చేసిన మోతీలాల్ అనే విద్యార్థి, గ్రూప్ 1,2,3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నాడు. నాడు హామీలు ఇచ్చినవారు నేడు పదవుల్లో ఉన్నారు కానీ, నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు చాన్స్ దొరికితే నిరుద్యోగుల డిమాండ్ల పై స్పందించే వారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకోవాలి. నిరుద్యోగుల సమస్యల విషయంలో భేషజాలకు పోవడం సరికాదు. అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చర్చలకు ఆహ్వానించి వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకొని పరిష్కరించాలని’ హరీష్ రావు కోరారు.


1. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. మీరు మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేసారు.  మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నాం. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఎంపిక చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నారు. కానీ అభ్యర్థుల కోరిక మేరకు 1:100  నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారు. గ్రూప్ 1 పరీక్ష అనేది యూపీఎస్సీ మాదిరిగా ప్రతి ఏడాది ఉండదు. అలా అవకాశం కల్పిస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రూప్ 1 ఉద్యోగం సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.   
గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు, ఇప్పటి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్రూప్ 1 మెయిన్స్ కు 1 :100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు మాట తప్పుకుంటున్నదో అర్థం కావడం లేదు. ప్రతిపక్షంలో ఒకమాట, అధికారంలో ఉంటే వేరొకతీరుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.  



2. గ్రూప్ 2కు 2 వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాలి 
3. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడంటో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2. వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు.
4. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం మొదటి క్యాబినెట్‌లోనే నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించారు. 25 వేల టీచర్ పోస్టులలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కానీ బీఆర్ఎస్ ఇచ్చిన 5000 పోస్టులకు మరో 6వేలు కలిపి 11 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. 
5. తొలి ఏడాదిలోగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. కానీ 7 నెలలు దాటినా నోటిఫికేషన్లు లేవు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నోటిఫికేషన్లు ఇవ్వాలి.
6. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలి.  
7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక జి.వో 46ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తి చేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి.