Harish Rao Vs Revanth Reddy: తెలంగాణలో రైతుల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తాము రుణమాఫీ గడువులోగా పూర్తి చేసినందున అన్న మాట ప్రకారం.. హరీశ్ రావు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గురువారం వైరా సభలో అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.


‘‘రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు. అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బిఆర్ఎస్ మీద నామీద అవాకులు చెవాకులు పేలాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తాన్నన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు.


ఆగస్టు 15తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. అంటే 9వేల కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు.  సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నడు. మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? ఈ ఒక్కవిషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది.


మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి? నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బిఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు. రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాని నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, నువ్వు చేసిన పాపఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు గాను, దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా.


ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పండో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను’’ అని హరీశ్ రావు అన్నారు.