Rajiv Gandhi International Airport | హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం (డిసెంబర్ 8) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన మూడు విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మూడు విమానాలను పైలట్లు సేఫ్ ల్యాండింగ్ చేయడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు దిగిన తరువాత భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
బెదిరింపులకు గురైన విమానాలు, వాటి మార్గాలు ఈ విధంగా ఉన్నాయి:
కేరళ కన్నూర్ - హైదరాబాద్ (ఇండిగో ఎయిర్లైన్స్ - విమాన సర్వీస్ 6E 7178)
ఫ్రాంక్ఫర్ట్ - హైదరాబాద్ (లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ - విమాన సర్వీస్ LH-752)
లండన్ - హైదరాబాద్ (బ్రిటిష్ ఎయిర్లైన్స్)
ఈ మూడు విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండయ్యాయి. ల్యాండింగ్ అయిన వెంటనే, భద్రతా ప్రమాణాల దృష్ట్యా అధికారులు ప్రయాణికులను తక్షణమే విమానాల నుంచి దించి, వారిని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. అనంతరం, భద్రతా అధికారులు బాంబు స్క్వాడ్ బృందాలతో కలిసి ఆ మూడు విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించినట్లు సమాచారం లేదు, అయితే తనిఖీ ప్రక్రియ కొనసాగుతోంది.
విమానాశ్రయ భద్రతపై ప్రభావంసాధారణంగా ఇలాంటి బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చినప్పుడు విమానాశ్రయ భద్రతా సంస్థలు (CISF), విమానయాన సంస్థలు, స్థానిక పోలీసులు, మరియు జాతీయ భద్రతా దళాలు (NSG) సమన్వయంతో పనిచేస్తాయి. బాంబు బెదిరింపు మెయిల్స్ కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలోని ఇతర విమానాల రాకపోకలపై, భద్రతా తనిఖీల ప్రక్రియపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణికులు విమాన ప్రయాణాలకు ముందు తమ విమాన సమయాన్ని ధృవీకరించుకోవాలని అధికారులు సూచించే అవకాశం ఉంది.