BJP Vishnuvardhan Reddy Tweet MLC Kavitha: భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ విమర్శలకు, సవాళ్లకు వేదికగా మారాయి. పీవీ నరసింహారావును కేవలం తెలంగాణ సరిహద్దులకే పరిమితం చేస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహనీయులకు ప్రాంతీయ గీతలు, భాషా భేదాలు అంటగట్టడం సరికాదంటూ ఆయన క్లియర్ కట్ కౌంటర్ ఇచ్చారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. పీవీ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆయనను కేవలం తెలంగాణ ముద్దుబిడ్డ గా సంబోధిస్తూ, ప్రాంతీయ సెంటిమెంట్ను జోడించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, గతంలో కూడా మహనీయులకు ప్రాంతాలు అంటగడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ నేతల విగ్రహాలను ఇక్కడికి పార్శిల్ చేస్తామనే తరహా అర్థం వచ్చేలా గతంలో వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన ఈ సంకుచిత వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. విశాఖపట్నంలో రాజకీయాలకు అతీతంగా పీవీ నరసింహారావు విగ్రహానికి తాము ఘనంగా నివాళులు అర్పించిన ఫోటోను జత చేస్తూ కవిత ట్వీట్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
"మహనీయులకు ప్రాంతాలు, భాషలు ఉండవు కవిత గారు! నేడు తెలుగు బిడ్డ పి.వి. నరసింహా రావు గారికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు అతీతంగా నివాళులు అర్పించాం. విద్వేష, విభజన రాజకీయాలు మానేసి ప్రజల కోసం పనిచేయండి. అప్పుడు భవిష్యత్తులో మీ విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశమంతా నిలుస్తాయి. ఇది విశాఖపట్నంలోని పి.వి. గారి విగ్రహం.. మేము మహనీయులను పార్శిల్ చేయం… భావి తరాలకు అందిస్తాం" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తన పోస్ట్లో రాసుకొచ్చారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ లాంటి అంతర్జాతీయ స్థాయి నేతను కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయడం కవిత రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
తెలంగాణ రక్షణ సేన పేరుతో సొంత పార్టీ పెట్టుకునిరాజకీయం చేస్తున్న కవిత.. తెలంగాణ సెంటిమెంట్ 'ఆంధ్రా-తెలంగాణ' విభేదాలను రాజేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందన్న ఆరోపణలుబ ీజేపీ నుంచి వస్తున్నాయి. అందులో భాగమే పీవీ నరసింహారావు లాంటి జాతీయ నాయకుడిని కూడా తమ సొంత బ్రాండ్గా మార్చుకునే ఈ ప్రయత్నం. అయితే, ఆంధ్రప్రదేశ్లో పీవీ జయంతి వేడుకలను అధికారికంగా, అత్యంత గౌరవప్రదంగా నిర్వహించడం ద్వారా.. తెలుగువారైన మహనీయులందరినీ ఏపీ గౌరవిస్తుందనే బలమైన సందేశాన్ని విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు పంపగలిగారు. ఆధునిక భారత ఆర్థిక శిల్పిగా కీర్తించే పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడని, ఆయనను ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం చేయడం ఆయన కీర్తిని తగ్గించడమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కవితకు విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
