Telangana BJP :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే 48 గంటల్లో ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.  బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు. మేం కనుక గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 


అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ లోకి వస్తారన్న కోమటిరెడ్డి                  


ఈ లోక్‌సభ ఎన్నిల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. అవసరమైతే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


రేవంత్ వసూళ్ల చిట్టా బీజేపీ దగ్గర                             


రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందన్నారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం రేవంత్ రెడ్డికి ఉందని విమర్శించారు. సీఎం పదవిపై పదిమంది మంత్రులు కన్నేశారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరేవారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారు? అని ప్రశ్నించారు. 


కోమటిరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారు !                


తాను షిండే అవుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో గడ్కరీతో అన్నారని... ఆయన చెప్పింది వాస్తవమేనని... తమ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. విచారణల పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందని తెలిపారు. ఆర్-ట్యాక్స్ కింద రూ.3వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తాను షిండే పాత్ర పోషిస్తానని గతంలో కోమటిరెడ్డి అన్నది వాస్తవమే అన్నారు. తమ్ముడి భార్యకు టిక్కెట్ రాకుండా చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.


ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారని చెబుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలపై మాత్రం ఎలాంటి చర్చ జరగడం లేదు.  కొద్ది  రోజుల కిందట సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు  రేవంత్ రె్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి  బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప కాంగ్రెస్‌లో చేరడంతో పాల్వాయి హరీష్ బాబు పార్టీ మారే అవకాశం లేదని తేలిపోయింది.