Telangana Political Cases :  తెలంగాణలో విద్యుత్ అధికారుల తీరు వివాదాస్పదం అయింది.  ఒక మహిళ తన ఇంటికి కరెంట్లేదని .. అధికారులకు ఫోన్  చేస్తే స్పందించడం లేదని ఓ ట్వీట్ పెట్టారు.  ఆమె అడ్రస్‌ మేరకు ఇంటికి వెళ్లిన విద్యుత్ అధికారులు ప్రాబ్లం సాల్వ్ చేశామని  ట్వీట్‌ తొలగించాలని కోరారు. అయితే ఆమె ట్వీట్ తొలగించడానికి ఇష్టపడలేదు. సమస్య పరిష్కారం అయింది కాబట్టి తొలగిస్తేనే వెళ్తామని విద్యుత్ సిబ్బంది మొండికేయడంత చేసేదిలేక ట్వీట్‌ను తొలగించింది.               

  


ఈ విషయాన్ని కూడా ఎక్స్‌లో మళ్లీ పోస్టు చేసింది.  వాట్‌ కైండ్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఈజ్‌ దిస్‌  అంటూ అసహనం వ్యక్తంచేసింది. ఈ అంశాన్ని  జర్నలిస్టు రేవతి రీ ట్వీట్‌ చేస్తూ విద్యుత్తుశాఖ తీరుపై విమర్శలు గుప్పించారు.  అధికార యంత్రాంగం  దారుణంగా ప్రవర్తించిందని విద్యుత్తు శాఖ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆమె ప్రశ్నించారు.                              


 





 


 జర్నలిస్టు రేవతి ‘ఇది విద్యుత్తు శాఖకు సంబంధించిన అంశం కదా. మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. ఒక మహిళకు జరిగిన ఇబ్బందిని తాను లేవనెత్తితే పోలీసులు ఎందుకు కలుగచేసుకుంటున్నారని ఆమె ట్వీట్‌లో ప్రశ్నించారు. విద్యుత్ అధికారులు రేవతిపై ఫిర్యాదు చేయడంతో IPC సెక్షన్‌ 505, 66D, ITA ACT - 2008 కింద కేసు నమోదు చేశారు.


 





 
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెంటనే కరెంటు రచ్చపై స్పందించారు. ‘విద్యుత్తు సరఫరాకు సంబంధించి పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తిన జర్నలిస్టుపైనే పోలీసులు బెదిరింపులకు పాల్పడతారా? రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు షాక్‌నిచ్చేలా ఉన్నాయి. అసలు మీకు ఏమి హక్కు ఉన్నదని విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తారు’ అని  ప్రశఅనించారు.   తెలంగాణ డీజీపీ, రాచకొండ పోలీసులు సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.