Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు వాస్తవాలను బహిర్గతం చేయాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న వేళ ఆ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లుగా లేఖలో రాశారు.


‘‘హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం, అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత మీదే. 


ఇప్పటికే ఓఆర్ఆర్ పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది ఏటా ఐదు శాతం పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి 30 వేల కోట్ల ఆదాయం చేకూరేది. ప్రభుత్వం ఈ ఆలోచన చేయకపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండీ కొట్టి మరీ టెండర్ ఇవ్వడం వెనుక జరిగితన తతంగం ఏమిటి? అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తోంది?


హైదరాబాద్ ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ (ఐఆర్బీ) సంస్థనే మహారాష్ట్రలోని ముంబయి - పుణె ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు, ముంబయి - పుణె నేషనల్ హైవే - 4 టోలింగ్ తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతను కూడా నిర్వహిస్తుంది. దీని పరిధి 1014 లేన్ కిలో మీటర్లు. ఒప్పంద కాలం పది ఏళ్లు. ఆదాయం రూ.8,875 కోట్లు. మరి తక్కువ దూరం, తక్కువ కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం టెండర్ అప్పగించినప్పుడు ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. 


ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్, లీకేజీ, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్ఆర్ టెండర్ లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి. ఓఆర్ఆర్ టెండర్ పై ప్రభుత్వ మార్గదర్శకాల టెండర్ల నోటిఫికేషన్ దగ్గర నుంచి, ఫైనలైజేషన్ వరకూ అంతా రహస్యంగానే ఉంచింది. బేస్ ప్రైస్ ఎంత పెట్టారో కూడా చెప్పేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. మరోవైపు ఓఆర్ఆర్ పై వార్తలు రాస్తే బెదిరింపులకు దిగుతున్నది. ప్రశ్నించే పార్టీలకు లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నది. అసలు ఈ టెండర్ విషయంలో ఏదో జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది. తక్షణమే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. అట్లాగే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సీఎం కేసీఆర్ (CM KCR) కు లేఖ రాశారు.