Bandi Sanjay: బీఆర్ఎస్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్, నలుగురు నేతలు 4 స్కాంలలో నిందితులు - బండి సంజయ్

ABP Desam Updated at: 19 Jan 2023 01:02 PM (IST)

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమతి అని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఒక జోకర్ అని ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

NEXT PREV

Bandi Sanjay: బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమావేశం అట్టర్ ఫ్లాప్ అయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేశారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు, అఖిలేష్ యాదవ్ లిక్కర్ స్కాం పైసల కోసమే బీఆర్ఎస్ మీటింగ్ కు వచ్చారని ఆరోపించారు. మీటింగ్ పేరుతో వాళ్లు ఆ ముచ్చట్లే మాట్లాడుకున్నారని విమర్శించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో నిందితులుగా ఉన్నారని అన్నారు. బండి సంజయ్ ఢిల్లీలో గురువారం (జనవరి 19) మీడియాతో మాట్లాడారు.


బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమతి అని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఒక జోకర్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సభకు వచ్చిన ఒక్క నేత కూడా ఆ పార్టీ గురించి మాట్లాడలేదని బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేంద్రంలో వచ్చేది ఆప్ సర్కారేనని కేజ్రీవాల్ సభలో ప్రకటించుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ కేంద్రంలో అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి తెలిసే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సభకు హాజరుకాలేదని బండి సంజయ్ చెప్పారు. జనం ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్ తప్ప, బీఆర్ఎస్ సభను పట్టించుకోలేదని అన్నారు.



తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన పుట్టిన రోజున సెక్రటేరియేట్ ను ప్రారంభిస్తాడట. పేద ప్రజల రక్తం తాగే నరరూప రాక్షసుడు కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ఎట్లా ప్రారంభిస్తారు? అంబేద్కర్ పై ప్రేమ ఉంటే ఏప్రిల్ 14న ఎందుకు ప్రారంభించరు. అంబేడ్కర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభిస్తే కేసీఆర్ కు అభ్యంతరం ఏంటి?- కేసీఆర్


దేశ వ్యాప్తంగా ఉచిత కరెంటు ఇస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ముందు డిస్కంలకు విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో కేసీఆర్ జతకట్టడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. దళితులను వంచించిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అసలు దళితులకు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఖమ్మం సభలో కేసీఆర్ కొత్తగా మాట్లాడింది ఏమీ లేదని అన్నారు. సభలో కేసీఆర్ వేషం, భాష తుపాకి రాముడి మాటల్ని గుర్తుచేస్తాయని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అజాంజాహీ మిల్లులను తెరిపించి, ఆ తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఎల్ఐసీ గురించి మాట్లాడాలని హితవు పలికారు. 



స్వర్గీయ బిపిన్ రావత్ ఆలోచన ‘అగ్ని పథ్’. ఆయనకంటే నువ్వు తోపుగాడివా? నీకు ఏం తెలుసని అగ్నిపథ్ గురించి మాట్లాడుతున్నవ్. మళ్లీ పాత పద్దతి తీసుకెళతానంటున్న కేసీఆర్.. మళ్లీ నెహ్రూ హయాంలోకి వెళతావా? ఆ సంగతి తరువాత తెలంగాణలో పోలీసు నియామకాల సంగతి చూడు. గందరగోళంగా మారితే ధర్నాలు చేసిన వాళ్లను, అడిగిన వాళ్లను లాఠీలతో కొడుతున్నరు- కేసీఆర్

Published at: 19 Jan 2023 12:35 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.