తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది బిజెవైఎం కార్యకర్తలు, రాష్ట్రంలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట విజయం అని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల అమలు కోసం పోరాడితే తప్ప స్పందించని నియంత ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగడం దురదృష్టకరం అన్నారు. అలాగే 317 జీవోను సైతం సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లున్న స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే స్పౌజ్ బదిలీలను వర్తింపజేయడం అన్యాయం అన్నారు. స్కూల్ అసిస్టెంట్లతోపాటు ఎస్జీటీ టీచర్లకూ స్పౌజ్ బదిలీల్లో అవకాశం కల్పించాలని బండి సంజయ్ కోరారు. 


తాజాగా ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.   


పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 12 నుంచి తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నారు.  తాజాగా మార్కులు కలపడంతో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించి ఆ తరువాత ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ నిర్వహించనుంది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.






ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్  ఈవెంట్స్ 
పాత లాగిన్ నెంబర్లతో ఈనెల 30 నుంచి వెబ్‌సైట్‌లో దేహదారుఢ్య పరీక్షల అప్లికేషన్‌ సబ్‌మిట్‌ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఫిజికల్ టెస్టు పూర్తి చేసిన వారు మళ్లీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కానీ వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు చెప్పింది.  హైకోర్టు ఆదేశాల ప్రకారం మార్కుల కలిపిన అనంతరం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 8న ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల వరకూ ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు నియామక బోర్డు స్పష్టం చేసింది.