YouTube Channels Blocked: కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టెక్నాలజీ అంశాలపై సైతం ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో ఇదివరకే భారతీయుల డేటాను చోరీ చేస్తున్నట్లు భావించిన పలు వెబ్ సైట్లు, విదేశీ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం జరగడం, ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. అదే విధంగా కొన్ని వెబ్ సైట్స్‌ను సైతం బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 


20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సోమవారం నిర్ణయం తీసుకుంది. దీనిపై మంగళవారం నాడు ఆ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధికార ప్రకటన విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్స్‌ను బ్లాక్ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ మంత్రిత్వ శాఖ స్పందించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్టియన్ స్కూళ్లను ఆరెస్సెస్ నాశనం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అనుమతి ఇచ్చారని, 200 మంది భారత ఆర్మీ సిబ్బంది శ్రీనగర్‌లో ఇస్లాం మతంలోకి మారారంటూ పలు విషయాలపై దుష్ప్రచారం జరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


పాకిస్తాన్ నుంచి సమాచారం అందుకుని యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మన దేశానికి సంబంధించి సున్నితమైన అంశాలను సైతం పాక్ వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లలో యథేచ్చగా ప్రసారం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు స్పష్టం చేసింది. కాశ్మీర్, భారత ఆర్మీ, దేశంలోని మైనారిటీ వర్గాలు, అయోధ్య రామ మందిరం, చనిపోయిన సీడీఎస్ బిపిన్ రావత్ లాంటి విషయాలపై తమకు ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని గుర్తించారు. వీటి వల్ల దేశంలో భయాలు, ఆందోళనకు దారి తీసే అవకాశం ఉందని.. భారత చట్టాలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఫేక్ న్యూస్ యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేశారు.


సరిహద్దుకు సంబంధించిన అంశాలపై సైతం దుష్ప్రచారం జరుగుతోంది. నయా పాకిస్తాన్ గ్రూప్ (NPG) వర్గం భారత్‌పై విషం చిమ్మేందుకు ఈ పనులు చేయిస్తుందని గుర్తించారు. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ, ఇంటెలిజెన్స్ వర్గాలు దేశ సమగ్రతను కాపాడేందుకు, అశాంతి నెలకొనకుండా చూడటం, దేశ చట్టాల ఉల్లంఘన లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పాక్ యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లపై వేటు వేశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2021 లోని రూల్ 16 కింద కేంద్రం తక్షణమే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. 


భారత్ బ్లాక్ చేసిన 20 యూట్యూబ్ ఛానెళ్లలో.. ద పంచ్ లైన్, ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్, ఖల్సా టీవీ, ద నేక్డ్ ట్రూత్, 48 న్యూస్, ఫిక్షనల్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, పంజాబ్ వైరల్, నయా పాకిస్తాన్ గ్లోబల్, కవర్ స్టోరీ, గో గ్లోబల్ ఈకామర్స్, జునైద్ హలీమ్ అఫీషియల్, తయ్యబ్ హనీఫ్, జైన్ అలీ అఫీషియల్, మోహ్‌సిన్ రాజ్‌పుత్ అఫీషియల్, కనీజ్ ఫాతిమా, సదాఫ్ దురానీ, మై ఇమ్రాన్ అహ్మద్, నజమ్ ఉల్ హసన్ బజ్వా ఉన్నాయి. 
Also Read: YouTube New Feature: వార్నీ.. ఈ ఫీచర్ భలే ఉందిగా.. మీరు కూడా జరిపేయండి..


Also Read: YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి