ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ నుంచి ఇటీవల భారత మార్కెట్‌లోకి విడుదల అయిన నార్డ్ 2 5జీ (OnePlus Nord 2 5G) పోన్ సేల్ ప్రారంభమైంది. దీని ప్రారంభ ధర రూ.27,999గా ఉంది. మీడియాటెక్ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి 5జీ ఫోన్ కూడా ఇదే. ఈ ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వన్‌ప్లస్ నుంచి గతంలో నార్డ్, నార్డ్ సీఈ 5జీ ఫోన్లు లాంచ్ అయిన విషయం తెలిసిందే. వీటి తర్వాతి మోడల్‌గా ఇది రిలీజ్ అయింది. వన్‌ప్లస్ నుంచి భారతదేశంలో రిలీజైన ఫోన్లలో నార్డ్ సీఈ తర్వాత అత్యంత చవకైన ఫోన్ ఇదే. ఇటీవల విడుదల అయిన పోకో ఎఫ్ 3 జీటీ, రియల్‌మీ ఎక్స్ 7 మాక్స్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. 
వేరియంట్లు, ధర.. 
వన్‌ప్లస్ నార్డ్ 2 5 జీ ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ధర రూ.27,999గా ఉంది. రెండో వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.29,999గా నిర్ణయించారు. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999గా ఉంది. 
అమెజాన్, వన్‌ప్లస్ డాట్ ఇన్ వెబ్ సైట్ల నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదని కంపెనీ తెలిపింది. దీని సేల్ ఆగస్టులో ఉంటుందని పేర్కొంది. ఈ ఫోన్ బ్లూ హేజ్, గ్రే సియారా, గ్రీన్ వుడ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. వీటిలో గ్రీన్ వుడ్ కలర్ ఇండియాలో మాత్రమే లభిస్తుంది. 
స్పెసిఫికేషన్లు ఇవే.. 
డ్యూయల్ సిమ్ (నానో) వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+(1,080x2,400 పిక్సెల్స్) ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గా, రిఫ్రెష్ రేట్ 90Hz గా ఉంది. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 1200 ఏఐ (MediaTek Dimensity 1200-AI) ప్రాసెసర్‌ ఆధారంగా ఈ ఫోన్ పనిచేయనుంది. 
దీనిలో ఉండే కస్టం స్కిన్.. ఒప్పో కలర్ ఓఎస్ 11.3 ఆధారంగా తయారైంది. వన్‌ప్లస్, ఒప్పో భాగస్వామ్యం అవడం ద్వారా ఇది సాధ్యమైంది. ఇందులో బ్యాక్ సైడ్ ప్రధాన కెమెరాగా 50 మెగా పిక్సెల్ సోనీ IMX 766 సెన్సార్‌ అందించారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. 
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ సోనీ IMX 615 ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీనిలో 4500 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీని అందించారు. ఇందులో ఉపయోగించిన వార్ప్ చార్జ్ 65 టెక్నాలజీతో కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు.