రాక్షసులు ప్రజల మాన ప్రాణాలను ఎలా తీసేవాళ్లో మనం కథల్లో వినే ఉంటాం. వారిని మనం ప్రత్యక్షంగా చూడకపోయినా అంతకంటే ప్రమాదకరమైన మోసగాళ్లను మాత్రం ఇప్పుడు చూస్తునే ఉన్నాం. అలాంటి వారే ఈ సైబర్‌ కేటుగాళ్లు. ప్రముఖ సంస్థల పేర్లనే వాడుకొని మనల్ని ముగ్గులోకి దించి నిండా ముంచేస్తారు. తెలిసిన కంపెనియే కదా అని టెంప్ట్ అయ్యారో అంతే సంగతి. 


 ఫేస్‌బుక్, ట్విటర్, మైక్రోసాఫ్ట్ కావేవి డేటా చోరీకి అనర్హం అంటారు సైబర్ నేరగాళ్లు. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతతో అమాయకులను లూటీ చేయడానికి స్కామర్లు రోజుకో మార్గాన్ని అన్వేషిస్తున్నారు. అమాయకుల డేటా చోరీ చేయడానికి తరచూ స్కామర్లు వాడే ప్రక్రియ ఫిషింగ్. ప్రముఖ కంపెనీల పేరుతో ఈమెయల్, మెస్సేజ్ పంపిస్తారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌ పాయింట్ వివరాల మేరకు.. మోసాలకు పాల్పడే స్కామర్లు ప్రముఖ, సుప్రసిద్ధ కంపెనీల లోగోలతో ఈమెయిల్ చేసి నమ్మించి మన డేటా తస్కరిస్తున్నారు.


స్కామర్లు తరచూ ఈ 10 పది కంపెనీల పేర్లు వాడుకుంటూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు కాజేస్తున్నారు
మైక్రోసాఫ్ట్: సైబర్ నేరగాళ్లు తరచూ ఎక్కువ శాతం వాడే కంపెనీ పేరు మైక్రోసాఫ్ట్. ఈ కంపెనీ పేరుతో ఏకంగా 29 శాతం స్పామ్, ఫిషింగ్ మెయిల్స్ పంపించి ఇంటర్నెట్ వినియోగదారుల డేటా చోరీ చేస్తున్నారు.
గూగుల్: మైక్రోసాఫ్ట్ తరువాత స్కామర్లు ఎక్కువగా గూగుల్ పేరు వాడుతారు. ఈ కంపెనీకి చెందిన లోగోతో 19.5 శాతం ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.
యాపిల్: మూడో స్థానంలో యాపిల్ సంస్థ లోగోను సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా యాపిల్ బ్రాండ్‌పై మధ్య, చిన్న తరగతి వ్యక్తుల్లో ఆసక్తి ఉంటుంది. యాపిల్ ఉత్పత్తులు వాడాలని ఎక్కువ శాతం మధ్య తరగతి యువత అనుకుంటారు. వారి బలహీనతను ఆసరగా చేసుకుని వారిని మోసగించేందుకు 5.2 శాతం ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.
వెల్స్ ఫార్గో: ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తుంది.  అమెరికాకు చెందిన ఈ కంపెనీ 35 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  ఈ సంస్థ పేరుతో దాదాపు 4.2 శాతం మోసపూరిత స్పామ్ మెయిల్స్ వస్తున్నాయి. 
అమెజాన్: ప్రపంచ వాప్తంగా నాలుగు శాతం ఫిసింగ్ ఈమెయిల్స్ ఈ కంపెనీ నకిలీ లోగోతో వెళ్తున్నాయి. 
వాల్‌మార్ట్: అమెజాన్ తరువాత ఆర్థిక నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగించే కంపెనీ వాల్‌మార్ట్. ఈ కంపెనీ పేరు, లోగోతో 3.9 శాతం నకిలీ ఈ మెయిల్స్ పంపిస్తున్నారు. వీటి తరువాత రోబ్లాక్స్ పేరుతో 3.8 శాతం, లింక్డ్ఇన్ పేరుతో 3 శాతం, హోం డిపోట్ పేరుతో 2 శాతం నకిలీ, స్పామ్ మెయిల్స్ వెళ్తున్నాయి. చివరగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేరును వాడుతున్నారు. కేవలం ఈ కంపెనీ పేరుతో 2.1 శాతం మెయిల్స్ పంపిస్తున్నారు.


సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడండి ఇలా..
ఏదైనా ప్రముఖ కంపెనీ మీకోసం ప్రత్యేకంగా లాటరీ, గిఫ్ట్ ఓచర్లు ప్రకటించినట్లు ఈమెయిల్ వస్తే వాటిని నమ్మొద్దు. ప్రత్యేకమైన ఆఫర్లను ఆయా సంస్థలు అధికారిక వెబ్‌సైట్లలో ప్రకటిస్తారు. ఈ మెయిల్‌లో వచ్చిన వివరాలు, అధికారిక వెబ్ సైట్‌లో ఉన్న వివరాలను క్రాస్ చెక్ చేసుకోండి. ఆఫర్ల కోసం ముందుగా ఎటువంటి ఆర్థిక చెల్లింపులు చేయొద్దు. మీ ఆధార్, పాన్, బ్యాంక్, క్రెడిట్, డెబిట్ కార్డ్, ఓటీపీ, సీవీవీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ బ్యాంకు అధికారులు కూడా ఓటీపీ, సీవీవీ చెప్పమని ఫోన్ చేయరు. కానీ ఎవరైనా ఫోన్ చేసి వివరాలు చెప్పమని అడిగితే వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తుంచుకోండి.