Harmanpreet Kaur: షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత అండర్-19 మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అయితే ఇప్పుడు సీనియర్ జట్టు వంతు వచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 12వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య ఈ హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది.


అదే సమయంలో ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద ప్రకటన చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి ముందు ఇది ముఖ్యమైన మ్యాచ్ అని, అయితే మా జట్టు దృష్టి మాత్రం మ్యాచ్ గెలవడంపైనే ఉందని చెప్పింది.


ఏది ముఖ్యమో మాకు తెలుసు - హర్మన్‌ప్రీత్ కౌర్
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, ‘మేం చాలా పరిణతి చెందాము. మాకు ఏది ముఖ్యమో మాకు తెలుసు. గత నెలలో జరిగిన తొలి అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించగా, సీనియర్ జట్టు కూడా ఈ విజయాన్ని పునరావృతం చేయాలని కోరుకుంటోంది. అండర్‌ 19 ప్రపంచకప్‌ చూసిన తర్వాత మాకు స్ఫూర్తి వచ్చింది. మంచి ప్రదర్శన కనబరిచేందుకు వారు స్ఫూర్తినిచ్చారు. ఇది మా అందరికీ ఒక ప్రత్యేక క్షణం. వారి విజయం చాలా మంది అమ్మాయిలను క్రికెట్‌ని చేపట్టడానికి స్ఫూర్తినిస్తుంది.’ అన్నారు.


పాకిస్తాన్‌పై భారత జట్టుదే పైచేయి
భారత మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య ఇప్పటివరకు 12 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, పాకిస్థాన్ రెండిట్లో మాత్రమే విజయం సాధించింది.


ఇరు జట్ల మధ్య గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం భారత జట్టు మాత్రమే వరుసగా విజయం సాధించింది. ఈ ఏడాది జూలైలో కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా భారత మహిళల జట్టు, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరిగింది. జూలై 31వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో పొరుగు దేశాన్ని ఓడించింది.


జనవరి 29వ తేదీన జరిగిన అండర్-19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టిటాస్ సధుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇంగ్లండ్‌కు చెందిన గ్రేస్ స్క్రివెన్స్ దక్కించుకుంది.


భారత జట్టు కూడా ప్రారంభంలోనే ఓపెనర్లు షెఫాలీ వర్మ (15: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), శ్వేతా సెహ్రావత్ (5: 6 బంతుల్లో, ఒక ఫోర్) వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 20 పరుగులు మాత్రమే. అయితే లక్ష్యం తక్కువగానే ఉండటంతో టీమిండియా బ్యాటర్లు ఎక్కడా తత్తర పడకుండా ఆడారు.


సౌమ్య తివారీ (24: 37 బంతుల్లో, మూడు ఫోర్లు), తెలంగాణకు చెందిన ప్లేయర్ గొంగడి త్రిష (24: 29 బంతుల్లో, మూడు ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే విజయానికి కొంచెం ముంగిట గొంగడి త్రిష అవుట్ అయింది. అయితే రిషితా బసు (0: 1 బంతి), సౌమ్య తివారీ మ్యాచ్‌ను ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, గ్రేస్ స్క్రివెన్స్, అలెక్సా స్టోన్ హౌస్‌లకు తలో వికెట్ దక్కింది.