Paris Olympics 2024 Day 3: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు తప్పలేదు. షూటింగ్‌లో మరో పతకం చేతి దాకా వచ్చి జారి పోవడంతో అభిమానుల హృదయం ముక్కలైంది. . 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల షూటింగ్‌ ఫైనల్‌లో అర్జున్‌ బబుతా త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం కొనసాగుతోంది. సాత్విక్‌-చిరాగ్‌ జోడీ క్వార్టర్స్‌కు చేరగా... లక్ష్యసేన్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. హాకీ జట్టు అర్జెంటీనాతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

 

హాకీ మ్యాచ్‌ డ్రా

భారత హాకీ(India) జట్టు అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక ఓటమి ఖాయమనుకున్న దశలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. పూల్ బీ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్‌ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగి చివరికి 1-1తో డ్రా అయింది. ఈ మ్యాచ్‌లో 58వ నిమిషం వరకూ అర్జెంటీనా  ఆధిక్యంలో ఉంది. 1-0తో వెనకపడిన దశలో పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలిచాడు. దీంతో స్కోరు 1-1తో స్కోరు సమమైంది. 22వ నిమిషంలో అర్జెంటీనాకు లూకాస్ మార్టినెజ్ తొలి గోల్‌ చేశాడు. ఆరు టీమ్‌లు ఉన్న పూల్‌ బీలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం భారత్‌ రెండు మ్యాచుల్లో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.  బెల్జియం తొలి స్థానంలో ఉండగా... ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. భారత్‌ మూడు, అర్జెంటీనా నాల్గవ స్థానంలో ఉంది.







 

ముక్కలైన హృదయం

ఈ విశ్వ క్రీడల్లో వెంట్రుకవాసిలో భారత్‌కు మరో పతకం మిస్‌ అయింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల షూటింగ్‌ ఫైనల్‌లో అర్జున్‌ బబుతా త్రుటిలో పతకాన్ని చేజార్చుకుని అభిమానుల హృదయాన్ని ముక్కలు చేశాడు. 208.4 పాయింట్లతో బబుతా ఫోర్త్‌ ప్లేస్‌లో నిలిచాడు. ఓ దశలో టాప్‌ 2లో ఉన్న బబుతా ఇక పతకం ఖాయం చేసేలా కనిపించాడు. కానీ అనూహ్యంగా రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. అర్జున్‌ లాస్ట్‌ షాట్‌లో 10.5 పాయింట్లు సాధిస్తే కాంస్య పతకం భారత్‌ వశమయ్యేది. కానీ అర్జున్ 9.5 పాయిట్లే సాధించడంతో నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. దీంకో కేవలం ఒక పాయింట్‌ తేడాతో అర్జున్‌ బబుతా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ ఈవెంట్‌లో చైనా షూటర్‌ షెంగ్ లిహావో గోల్డ్‌ మెడల్‌ సాధించగా... స్వీడన్‌కు చెందిన లిండ్‌గ్రెన్ విక్టర్ సిల్వర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. క్రోయేషియా మారిసిక్ మీరాన్ 230.0 పాయింట్లతో కాంస్యాన్న దక్కించుకోగా.. బబుతా 208.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.

 

క్వార్టర్‌లో సాత్విక్‌-చిరాగ్‌

భారత పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్‌-చిరాగ్ శెట్టి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించారు. సాత్విక్, చిరాగ్ పురుషుల బ్యాడ్మింటన్ క్వార్టర్స్ కు చేరారు. ఒలింపిక్స్ లో క్వార్టర్స్ చేరిన తొలి జోడీగా రికార్డు నెలకొల్పారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ రద్దు కావడంలో ఈ జోడీ క్వార్టర్‌కు చేరింది. మంచి ఫామ్‌లో ఉన్న ఈ జోడీ వరుస విజయాలతో పతక ఆశలు రేపుతున్నారు.

 

నిరాశపరిచిన రమిత

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఉమెన్స్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరి పతకంపై ఆశలు రేపిన  రమిత జిందాల్‌ ఫైనల్లో అంచనాలు అందుకోలేకపోయింది. ఫైనల్‌ పోరులో ఏడో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. అయితే ఈ ఓటమి నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని పతకం సాధించిన అనంతరం రమిత వ్యాఖ్యానించింది.

 

లక్ష్యం దిశగా లక్ష్యసేన్‌...

ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ పతక ఆశలు రేపుతున్నాడు. గ్రూప్‌ ఎల్‌ మ్యాచ్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. బెల్జియానికి చెందిన జులిన్ కారగ్గిపై  21-19, 21-16తో వరుస సెట్లలో లక్ష్యసేన్‌ గెలుపొందాడు. మొదటి సెట్‌లో ఇద్దరు షట్లర్లు హోరాహోరీగా తలపడ్డారు. రెండో సెట్‌లో ఆరంభం నుంచే దూకుడుగా అడిన లక్ష్యసేన్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.