IND vs ZIM: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీసుకు టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. అనుకున్నట్టుగానే సీనియర్‌ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చారు. కుర్రాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. స్వింగ్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పునరాగమనం చేస్తున్నారు. రాహుల్‌ త్రిపాఠి వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న కేఎల్‌ రాహుల్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేడు.


ప్రస్తుతం టీమ్‌ఇండియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతోంది. అది ముగియగానే జింబాబ్వేకు బయల్దేరుతుంది. ఆగస్టు 18, 20, 22న వన్డేలు ఆడుతుంది. మ్యాచులన్నీ హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లోనే జరుగుతాయి. శనివారం రాత్రి జట్టును ఎంపిక చేశారు. భారత్‌ షెడ్యూలు బిజీగా ఉండటంతో సీనియర్‌ ఆటగాళ్లను రొటేట్‌ చేస్తున్నారు.


దీపక్‌ చాహర్ ఆరు నెలల క్రితం మ్యాచ్‌ ఆడాడు. ఐపీఎల్‌ సీజన్‌కూ దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో సుదీర్ఘ కాలం విశ్రాంతి తీసుకున్నాడు. కొంత కాలంగా బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌లో గడిపాడు. ఫిట్‌నెస్‌ సాధించడంతో అతడిని ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా టీ20 సిరీసులో అరంగేట్రం చేసిన రాహుల్‌ త్రిపాఠికి వన్డే సిరీసులో అవకాశం ఇచ్చారు. వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు.


ఐపీఎల్‌ తర్వాత స్పోర్ట్స్‌ హెర్నియాతో కేఎల్ రాహుల్‌ టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. రికవరీ ఆలస్యం కావడంతో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లలేదు. ఎన్‌సీఏలోనే శిక్షణ పొందాడు. వెస్టిండీస్‌ సిరీసుకు ఎంపికైనా కొవిడ్‌ రావడంతో ఆగిపోయాడు. అదే కారణంతో ఇప్పుడు జింబాబ్వే సిరీసుకూ అందుబాటులో లేడు. దాంతో తన ఆరోగ్యం గురించి అభిమానులకు తెలియజేశాడు.


'హే గాయ్స్‌! నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ గురించి మీకు స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. జూన్‌లో నాకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ సిరీసు కోసం భారత్‌ జట్టులోకి వచ్చేందుకు సాధన మొదలు పెట్టాను. మళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువైన తరుణంలో కొవిడ్‌-19 సోకింది. దాంతో నా పునరాగమనం మరికొన్ని వారాలు ఆలస్యమైంది. ఏదేమైనా నేను వేగంగా కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. అతి త్వరలోనే సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే అత్యంత గౌరవం. వీలైనంత వేగంగా బ్లూ జెర్సీ ధరిస్తాను' అని కేఎల్‌ రాహుల్‌ ట్వీట్‌ చేశాడు.


టీమ్‌ఇండియాకు బిజీ షెడ్యూలు ఉండటంతో కొందరు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చారు. విండీస్‌ సిరీస్‌ ఆడిన రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేయలేదు. రొటేషన్‌లో భాగంగా వారిని తప్పించారు. వెస్టిండీస్‌ సిరీస్‌ నుంచి విరాట్‌ కోహ్లీ విరామంలో ఉన్న సంగతి తెలిసిందే.


భారత జట్టు: శిఖర్ ధావన్‌ (కె), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, దీపక్ చాహర్‌