ICC Fine Team India: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఐసీసీ జరిమానా విధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపొందింది. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఈ పెనాల్టీని ఐసీసీ విధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ టీమ్ ఇండియాకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతం జరిమానా విధించారు.


టీమ్ ఇండియాకు మ్యాచ్‌ ఫీజులో 60 శాతం జరిమానా
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 18వ తేదీన హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. నిర్ణీత సమయం కంటే మూడు ఓవర్లు తక్కువ బౌలింగ్ చేసినందుకు ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ టీమ్ ఇండియా కారణమని నిర్ధారించారు. దీంతో మ్యాచ్ రిఫరీ భారత జట్టుపై మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించారు.


అసలు ఐసీసీ నియమం ఏమిటి?
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత సమయంలో వేయాల్సిన దాని కంటే మూడు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. అందుకే టీం ఇండియా మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించింది.


హియరింగ్ అవసరం లేదు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆన్-ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్, థర్డ్ అంపైర్ కే.ఎన్.అనంతపద్మనాభన్, ఫోర్త్ అంపైర్ జైరామ్ మదన్ గోపాల్ చేసిన అభియోగాలను అంగీకరించారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంపై అధికారిక విచారణ ఉండదు.


మొదట బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ అద్భుత డబుల్ సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో చెలరేగటంతో టీమిండియా విజయం సాధించింది. ఆ జట్టు బ్యాటర్ మైఖెల్ బ్రాస్ వెల్ (140) వీరోచిత శతకంతో జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశాడు. 


ఈ మ్యాచ్ లో ఆటంతా శుభ్‌మన్ గిల్ దే. మొదట్నుంచి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ ఇన్నింగ్స్ చివరి వరకు అదే ఊపును కొనసాగించాడు. శుభ్‌మన్ గిల్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కళాత్మక షాట్లు కొడుతూ స్కోరు వేగం అస్సలు తగ్గకుండా చూశాడు. చూస్తూ ఉండగానే అర్ధశతకం, శతకం పూర్తిచేసుకున్నాడు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన గిల్ మైదానం నలువైపులా చూడచక్కని షాట్లు కొట్టాడు. ఈ క్రమంలో 146 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. ఇది గిల్ కు మొదటి డబుల్ సెంచరీ. అతనికి సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28) సహకరించారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.