IND vs AUS: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద సమస్య తలెత్తింది. జట్టులోని ముఖ్యమైన ఆటగాడు, కామెరాన్ గ్రీన్ తన వేలి గాయం నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీని కారణంగా అతనికి నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్ ఆడడం చాలా కష్టం. కామెరాన్ గ్రీన్ తన వేలికి గాయమైన తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు, అతను పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి ఇంకా కొంత సమయం పడుతుంది.


ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని ఆలూరు క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది, అక్కడ కామెరాన్ గ్రీన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే అతను బౌలింగ్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తమ తొలి టెస్టు మ్యాచ్‌లో గ్రీన్ ఆడే విషయంపై పూర్తిగా ఏమీ చెప్పలేనని తెలిపాడు.


ప్యాట్ కమిన్స్ గురువారం ఫాక్స్ క్రికెట్‌లో తన ప్రకటనలో మాట్లాడుతూ, ‘కామెరాన్ గ్రీన్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేడని నాకు తెలుసు. వచ్చే వారం మనందరికీ చాలా ముఖ్యమైనది. ఈ రకమైన గాయం త్వరగా నయమవుతుందని నేను భావిస్తున్నాను. వచ్చే వారం నాటికి దానిలో చాలా మెరుగుదల ఉంటుందని మేం ఆశిస్తున్నాం.’ అన్నాడు.


ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మిచెల్ స్టార్క్, భారత్‌తో సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తాను పాల్గొనలేనని ఇప్పటికే ధృవీకరించారు. నిజానికి మిషెల్ స్టార్క్ తన ఎడమ చేతి వేలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టుకు ఇది పెద్ద దెబ్బగా భావించవచ్చు.


ఇరు జట్ల మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ 9వ తేదీన జరగనుండగా, రెండో మ్యాచ్ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత జట్టుకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్‌. కచ్చితంగా గెలవాల్సిందే.


మరోవైపు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు శుభవార్త. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ)లో పునరావాసం పొందిన బుమ్రా కోలుకున్నట్లు సమాచారం. బౌలింగ్ కూడా ప్రారంభించాడు. త్వరలోనే టెస్టు జట్టులో భాగం కానున్నాడు. అయితే చివరి రెండు టెస్టులకు మాత్రమే బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. 


భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 'మూడో టెస్ట్ మార్చి 1వ తేదీ నుంచి ధర్మశాల వేదికగా జరగనుంది. అవును. బుమ్రా నెట్స్ లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం అతను ఫిట్ గా ఉన్నాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది.' అని ఎన్ సీఏ అధికారి ఒకరు తెలిపారు. 


ఇంగ్లండ్ పర్యటన తర్వాత బుమ్రా వెన్ను గాయం గురించి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు, ఆసియా కప్ 2022 కు దూరమయ్యాడు. ఎన్ సీఏ పునరావాసం పొందిన తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే ఆ మ్యాచ్ మధ్యలోనే వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. దాదాపు 5 నెలల పునరావాసం తర్వాత తాజాగా శ్రీలంకతో జరిగిన సిరీస్ కు ఎంపికైనా.. మళ్లీ జట్టు నుంచి తొలగించారు. దీంతో మళ్లీ ఎన్ సీఏకు వెళ్లాడు.