Virat Kohli: భారత క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. 2022లో ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ సాధించి ఫాంలోకి వచ్చాడు. కానీ అతను దానిని టెస్ట్ ఫార్మాట్‌లో కొనసాగించలేకపోతున్నాడు.


అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)లను ఫ్యాబ్ 4 అని పిలుస్తారు. వీరందరూ అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన క్లాస్ బ్యాట్స్‌మెన్.


కానీ ప్రస్తుతం ఫ్యాబ్ 4 బ్యాట్స్‌మెన్‌లను పరిశీలిస్తే ఒకప్పుడు అన్ని విధాలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరుకున్నాడు. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి బ్యాటింగ్ యావరేజీ చాలా పేలవంగా ఉంది. అది 20కి పడిపోయింది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్లాస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సగటు 40గా ఉంది.


ఇది కాకుండా న్యూజిలాండ్ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 57 సగటుతో పరుగులు సాధించగా, ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ కూడా 52 సగటుతో పరుగులు చేయగలిగాడు.


2019లో విరాట్ కోహ్లి చివరిసారిగా టెస్టు ఫార్మాట్‌లో సెంచరీ చేశాడు. గత 20 టెస్టు ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజీ చాలా తక్కువగా ఉంది. ఇందులో అతను కేవలం 25 సగటుతో మాత్రమే పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతని బ్యాట్ ఒక్కసారి మాత్రమే 50 కంటే ఎక్కువ పరుగులను దాటింది. 2021 డిసెంబర్లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ అర్థ సెంచరీవచ్చింది.


గత 20 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఫాబ్ 4లో ఉన్న ఇతర ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల బ్యాటింగ్ సగటు చూస్తే అది చాలా ఆకట్టుకుంటుంది. ఇందులో రూట్ బ్యాటింగ్ యావరేజ్ 66 కాగా, స్టీవ్ స్మిత్ యావరేజ్ 60, కేన్ విలియమ్సన్ యావరేజ్ 59గా ఉంది.


టాడ్ మర్ఫీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి సమస్యగా కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్టుల్లో కష్టపడుతున్నాడు. మర్ఫీ ఈ సిరీస్‌లో ఎంతో పోరాడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్‌లలో 98 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 44 పరుగులు మాత్రమే.


టాడ్ మర్ఫీ ఈ సిరీస్‌లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, నాగ్‌పూర్‌లో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టాడ్ మర్పీ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. మర్ఫీ ఇప్పటివరకు కింగ్ కోహ్లీని మూడు మ్యాచ్‌లలో మూడు సార్లు అవుట్ చేశాడు. ఒకసారి మాథ్యూ కుహ్నేమాన్ కోహ్లీకి పెవిలియన్‌ దారి చూపించాడు. ఇండోర్‌లో ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో, విరాట్ కోహ్లీని మర్ఫీ ఎల్‌బీడబ్ల్యూ ద్వారా అవుట్ చేశాడు.


ఇండోర్‌లో ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది.