Highest Team Total in T20 World Cup: 2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 253 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరో ఓపెనర్ అభిషేక్ విఫలమైనా సంజూ శాంసన్ 89 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. శివమ్ దూబే, తిలక్ వర్మ, పాండ్యాలు తలో చేయి వేయడంతో భారత్ భారీ స్కోరు చేసి ఇంగ్లాండ్ కష్టసాధ్యమైన టార్గెట్ ఇచ్చింది. 

భారత్ అత్యధిక స్కోరు రికార్డు

టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2012 వరల్డ్ కప్‌లో పటిష్ట ఆస్ట్రేలియాపై 205 పరుగులు చేసింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో 200 కంటే ఎక్కువ స్కోరు సాధించిన జట్లు భారత్, వెస్టిండీస్ మాత్రమే.

విరాట్ సరసన శాంసన్ 

ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ, భారత జట్టు రన్-రేట్ తగ్గకుండా సంజు శాంసన్ మరోసారి బాధ్యత తీసుకున్నాడు. శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ వరుసగా రెండో మ్యాచులో శతకం చేజారింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా సంజూ శాంసన్ శామ్సన్, విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో శాంసన్‌కు ఇది వరుసగా రెండో అర్ధశతకం.

భారత్ ఇన్నింగ్స్..

2వ ఓవర్‌కే అభిషేక్ శర్మ (9) ఔటైనా ఇషాన్ కిషన్ తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇషాన్ సైతం సంజూతో పోటీ పడి వేగంగా పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆ తరువాత తిలక్ వర్మ, సూర్య కుమార్ కు బదులుగా శివం దుబే బ్యాటింగ్ కు వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు సంజూ  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో సంజూ శాంసన్ (42 బంతుల్లో 89, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విల్ జాక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 13.1 ఓవర్లలో  160. 

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (11) విఫలమైనప్పటికీ శివం దుబే, హార్ధిక్ పాండ్యా రన్ రేట్ తగ్గకుండా చూశారు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి శివం దుబే (25 బంతుల్లో 43, 1 ఫోర్, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 212/5 .హార్దిక్ కాల్ చేయడంతో ఈ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. తరువాత తిలక్ వర్మ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 3 సిక్సర్లు బాది, అదే ఓవర్లో బౌల్డయ్యాడు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) కీలకమైన పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో పరుగులకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ , ఆదిల్ రషీద్ చెరో 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ ఒక్క వికెట్ పడగొట్టాడు. కానీ భారత బ్యాటర్ల ధాటికి ఇంగ్లీష్ బౌలర్లు పోటీపడి పరుగులు సమర్పించుకున్నారు. 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చిన విల్ జాక్స్ బౌలింగే బెస్ట్ యావరేజ్ కావడం విశేషం.