T20 World Cup Winner: అహ్మదాబాద్లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
IND vs NZ Final Highlights: భారత్ రికార్డ్ స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా సరికొత్త చరిత్ర లిఖించింది.

T20 World Cup Winner 2026: భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 కైవసం చేసుకోవడంలో భాగంగా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని డిఫెండ్ చేసిన (వరుసగా రెండోసారి గెలిచిన) తొలి దేశంగా భారత్ అవతరించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 255 పరుగులు చేయగా, ప్రత్యర్థి కివీస్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది.
చరిత్ర సృష్టించిన భారత జట్టు
ఇప్పటివరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్ కూడా రెండు సార్లు చొప్పున టీ20 వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచాయి. అయితే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని 3 సార్లు సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇండియా 2007లో నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తాజాగా టైటిల్ నిలుపుకుంది. ఏ జట్టు కూడా టీ20 ఫార్మాట్లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలవలేదు. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా కూడా భారత్ రికార్డు సృష్టించింది.
A 𝗻𝗲𝘄 𝘀𝘁𝗮𝗿 is born! ⭐🥹️
— BCCI (@BCCI) March 8, 2026
Scorecard ▶️ https://t.co/5LXBod8bl1#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #Final | #INDvNZ pic.twitter.com/qVfcc46G5R
ఫైనల్లో అత్యధిక స్కోరు
టాస్ ఓడిపోయిన తర్వాత భారత జట్టు ఫస్ట్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతో పాటు ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్లతో అర్ధ సెంచరీలు సాధించారు. శాంసన్ 89 పరుగులు చేయగా, ఈ వరల్డ్ కప్లో అతనికిది వరుసగా మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం. కాగా, ఈ మూడు మ్యాచ్ల్లోనూ సెంచరీలు చేజారాయి. మరోవైపు అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేయగా.. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ కిషన్ కూడా 25 బంతుల్లో 54 పరుగుల సహకారాన్ని అందించాడు. నాకౌట్ మ్యాచులలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు.
భారత్ 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు రికార్డు కూడా భారత్ పేరిటే ఉండేది, 2024 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 176 పరుగులు చేసింది. ఇప్పుడు ఇండియా తన సొంత రికార్డును మెరుగుపరుచుకుంటూ ఏకంగా 255 పరుగులు సాధించింది.
96 పరుగుల భారీ విజయం
256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు రేసులో ఉన్నట్లు కనిపించలేదు. టిమ్ సీఫెర్ట్ చేసిన 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన 43 పరుగుల ఇన్నింగ్స్ మినహా ఏ కివీస్ బ్యాటర్ కూడా కనీసం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. పవర్ ప్లేలో వికెట్ కూడా కోల్పోకుండా 6 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు చేసింది శాంసన్, అభిషేక్ జోడీ. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు ఇది.
భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. కానీ అంతకుముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేసి కివీస్ను దెబ్బకొట్టాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ కూడా తలో వికెట్ తీసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు

















