IND vs ENG 2nd Test: మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత శుభ్‌మన్ గిల్(Shubman Gill), జట్టుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీనికి తోడు ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌(Edgbaston Test)లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఆడలేదు. ఆ తర్వాత భారత్‌ బౌలింగ్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. వారు 20 వికెట్లు తీసుకోగలరా అని చాలా మందికి అనుమానం. కానీ ఆ అనుమానాలు తప్పని ఆకాష్ దీప్(Akash Deep), మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) నిరూపించారు. అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఓడించారు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇది టీమ్ ఇండియాకు తొలి విజయం. ఈ విజయం టీమిండియా సమష్టి విజయంగా చెప్పాలి. అయితే భారతదేశం విజయం సాధించడానికి 5 ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

శుభ్‌మన్ గిల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఆకట్టుకున్నాడు. తన క్లాస్ బ్యాటింగ్‌తో మనస్సులు గెలుచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) సాధించిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే జోరు కొనసాగించాడు. సెంచరీ (161)తో దుమ్మురేపాడు. ఒక టెస్ట్‌లో అత్యధిక పరుగులు (430) చేసిన మొదటి భారతీయుడు, ప్రపంచంలోనే రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ కోసం గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ రప్పా రప్పామొదటి ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆకాష్ దీప్ వరుసగా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కూల్చివేశాడు.  ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ కూడా సత్తా చాటాడు. సిరాజ్ లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పని పట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ టాప్ ఆర్డర్‌ను కూల్చివేశాడు. ఇది విజయానికి ప్రధాన కారణం. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ 6 వికెట్లు తీసి మ్యాచ్‌లో తన 10 వికెట్లు పూర్తి చేశాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవీంద్ర జడేజా,  వాషింగ్టన్ సుందర్‌ ఒక్కొక్క వికెట్ తీశారు. 

మెరుగైన ఫీల్డింగ్మొదటి టెస్ట్‌లో భారత్ ఓడిపోవడానికి ఒక కారణం పేలవమైన ఫీల్డింగ్. ఆటగాళ్ళు 8 క్యాచ్‌లు వదిలేశారు, రెండో టెస్ట్‌లో మాత్రం టీమిండియా తప్పులకు అవకాశం ఇవ్వలేదు. ఫీల్టింగ్‌లో పురోగతి కనిపించింది. పరుగులు ఆపడం నుంచి స్లిప్‌లో మంచి క్యాచ్‌లు పట్టడం వరకు అన్నింటా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ టెస్ట్‌లో మంచి ఫీల్డింగ్ కూడా విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్మొదటి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో భారతదేశం లోయర్ ఆర్డర్‌ పేలవంగా బ్యాటింగ్ చేసింది. కనీసం పోరాడకుండానే బ్యాట్‌లు ఎత్తేశారు. దీంతో ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలిపోయాయి. ఇది మొదటి టెస్టు ఓటమికి ఒక కారణంగా మారింది. టాప్ ఆర్డర్ బాగా రాణించినప్పటికీ కనీసం వంద పరుగులు కూడా లోయర్ ఆర్డర్ చేయకపోవడం నిరాశ పరిచింది. కానీ రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) ముఖ్యమైన పాత్ర పోషించారు. మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోర్‌(587)చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా జడేజా 69 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.

ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ ప్రదర్శనరెండు ఇన్నింగ్స్‌లలో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ అయ్యారు. పిచ్‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ పరుగులు చేయడంలో వారు ఫెయిల్ అయ్యారు. బౌలర్లకు అంతగా సహకరించని పిచ్‌లోకూడా భారత్‌ బౌలర్లు అద్భమతైన బంతులు వేశారు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించారు. టాప్ 4 బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడితే, జాక్ క్రాలీ (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0), జో రూట్ (22) మంచి ప్రారంభం ఇవ్వలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో క్రాలీ (0), డకెట్ (25), పోప్ (24), రూట్ (6) త్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు.