టీమ్‌ఇండియా(Team India) నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌(Rinku Singh)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు బ్యాటింగ్‌ చేస్తుంటే స్టాండ్స్‌లోని అభిమానులు 'రింకూ.. రింకూ.. రింకూ' అంటూ నినాదాలు చేస్తున్నారు. టీమిండియా నయా ఫినిషర్‌గా పేరుగాంచిన రింకూసింగ్‌పై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. టీ 20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ రింకూపై భారీ ఆశలు ఉన్నాయి. ఇప్పుడు టెస్టుల్లో కూడా రాణిస్తూ ఆశలు పెంచుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ 2024(Ranji Trophy 2024)  సీజన్‌లో కేరళ(Kerala)తో మొదలైన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ తరపున బరిలోకి దిగిన రింకూ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడుతూ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 103 బంతుల్లో 7 ఫోర్లు... 2 సిక్సర్ల సాయంతో రింకూ 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన ఉత్తర ప్రదేశ్‌ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో బరిలోకి దిగిన రింకూ.. బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు. దృవ్‌ జురెల్‌తో కలిసి రింకూ 100 పరుగుల అజేయమైన, విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. 

 

ఉత్తరప్రదేశ్‌ తొలిరోజు స్కోరు ఎంతంటే..?

కేరళపై టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (71), దృవ్‌ జురెల్‌ (54), ప్రియం గార్గ్‌ (44), కెప్టెన్‌ ఆర్యన్‌ జుయల్‌ (28), సమీర్‌ రిజ్వి (26) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఓపెనర్‌ సమర్థ్‌ సింగ్‌ (10), ఆక్ష్‌దీప్‌ నాథ్‌ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కేరళ బౌలర్లలో పి, నిధీష్‌, వైశాక్‌ చంద్రన్‌, జలజ్‌ సక్సేనా, శ్రేయాస్‌ గోపాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

 

చరిత్ర సృష్టించిన వైభవ్‌ 

దేశవాళీ అత్యున్నత క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీలో బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీ‌లోకి బీహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ రంజీల్లోకి అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ముంబైతో మొదలైన మ్యాచ్‌లో బీహార్‌ తరఫున వైభవ్‌ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగిన వైభ‌వ్.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్‌ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్‌ పేరిట ఉంది. అలీముద్దీన్‌ 1942-43 రంజీ సీజన్‌లో రాజ్‌పుటానా తరఫున 12 ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. అలీముద్దీన్‌ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన రికార్డు ఎస్‌కే బోస్‌, మొహమ్మద్‌ రంజాన్‌ పేరిట ఉంది. బోస్‌.. 1959-60 రంజీ సీజన్‌లో 12 ఏళ్ల 76 రోజుల వయసులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. రంజాన్‌.. 1937 సీజన్‌లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.