Ranji Trophy prize money :  రికార్డుస్థాయిలో 42వసారి రంజీ ట్రోఫీ (Ranjo Trophy)  ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు(Mumbai Team)కు... ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌(MCA) నజరాన ప్రకటించింది. జట్టు సభ్యులకు రంజీ ట్రోఫీ ప్రైజ్‌మనీతోపాటు డబుల్‌ నజరానాను ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రైజ్‌మనీ వచ్చేదానితోపాటు అదనంగా రూ.5 కోట్లను ముంబై జట్టుకు ఇవ్వనున్నట్లు MCA తెలిపింది. రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు సభ్యులకు ప్రైజ్‌మనీని డబుల్‌ ఇవ్వాలని భావించామని... ఈ సీజన్‌లో ముంబై ఏడు టైటిళ్లు సాధించిందని... MCA కార్యదర్శి అజింక్యా నాయక్ తెలిపారు. అందుకే వారికి నజరాన ప్రకటించాలని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమోల్‌ ఖేర్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. 




 

రంజీ ఛాంపియన్‌ ముంబై

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తమకు ఎదురులేదని ముంబై మరోసారి  చాటిచెప్పింది. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా జ‌రిగిన ఫైన‌ల్లో విద‌ర్భను మ‌ట్టిక‌రిపించి 8 ఏళ్ల త‌ర్వాత ముంబై టైటిల్‌ను ముద్దాడింది. చివరిసారిగా 2015-16 సీజన్‌లో సౌరాష్ట్రను ఓడించి ముంబై ఛాంపియన్‌ అయింది. ఫైనల్లో భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా విదర్భ పోరాటం ఆకట్టుకుంది. 

ఫైనల్‌ మ్యాచ్‌లో విదర్భపై 169 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 350/5 స్కోరుతో విజయం దిశగా సాగిన విదర్భను ముంబయి బౌలర్లు కట్టడి చేయగలిగారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి జట్టును గెలిపించారు. విదర్భ కెప్టెన్ అక్షయ్ వడ్కర్ సెంచరీ సాధించి జట్టును గెలిపించేందుకు చివరి వరకూ పోరాడాడు. ముంబై బౌలర్లు తనుష్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్‌ దేశ్‌ పాండే 2.. శార్దూల్, షామ్స్‌ ములాని చెరో వికెట్‌ తీశారు. సెంచ‌రీ హీరో ముషీర్ ఖాన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోగా.. ముంబై బౌలర్‌ త‌నుష్ కొటియాన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుపొందాడు. 

 

తొలి ఇన్నింగ్స్‌లో...,

ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్‌ అయింది. ముంబై బౌలర్ల ముందు విదర్భ బౌలర్లు నిలపడలేకపోయారు. యశ్‌ రాథోడ్‌ ఒక్కడే 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో ధవల్‌ కులకర్ణి, శామ్స్‌ ములానీ, తనూష్‌ కొటియాన్‌లు తలా మూడు వికెట్లు తీయగా శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 రన్స్‌కు ఆలౌటైంది. ఈక్రమంలో విదర్భ జట్టు ముందు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ అద్భుత శతకంతో ముంబైకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. 326 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్‌ 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. విదర్భ బౌలర్లలో హర్ష్‌ దూబె ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భ 368 పరుగులకే ఆలౌట్‌ అయి పరాజయం పాలైంది.