Ind Vs Eng 2nd Test Day 4 Latest Updates: విజయానికి 7 వికెట్లు.. రెండోటెస్టులో విజయంపై భారత్ గురి.. ఇంగ్లాండ్ ఎదురీత.. రాణించిన ఆకాశ్ దీప్
రెండోటెస్టును కైవసం చేసుకునేందుకు ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థికి భారీ టార్గెట్ ను సెట్ చేసిన టీమిండియా.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి, ఐదో రోజు విజయం సాధించాలని ప్లాన్ సెట్ చేసుకుంది.
Akashdeep Get 2 Wickets: ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో భారత్ డామినేషన్ చూపిస్తోంది. ఇప్పటికే భారీ టార్గెట్ ను నిర్దేశించిన టీమిండియా.. ప్రత్యర్థి టాపార్డర్ ను కకావికలం చేసి, విజయంపై కన్నేసింది. శనివారం నాలుగోరోజు 608 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటముగిసే సమయానికి 16 ఓవర్లలో 3 వికెట్లకు 72 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఒల్లీ పోప్ (24 బ్యాటింగ్), హేరీ బ్రూక్ (15 బ్యాటింగ్) ఉన్నారు. భారత విజయానికి మరో 7 వికెట్లు అవసరం కాగా, ఇంగ్లాండ్ విజయానికి మరో 536 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఆకాశ్ దీప్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్ ఒక వికెట్ దక్కింది.
ఆకాశ్ దీప్ హవా..
608 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను ఆకాశ్ దీప్ వణికించాడు. మంచి యాంగిల్స్ తో బౌలింగ్ చేసి, రెండు కీలక వికెట్లను కొల్లగొట్టాడు. అంతకుముందు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీ ని డకౌట్ చేశాడు. మంచి లెంగ్త్ లో బౌలింగ్ చేయగా, డ్రైవ్ ఆడిన క్రాలీ ఔటయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ హవా మొదలైంది. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే బెన్ డకెట్ (25)ను తనే ఔట్ చేశాడు. ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేసి, డకెట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరింత చక్కగా బౌలింగ్ చేస్తూ, ప్రమాదకర జో రూట్ (6) ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఒల్లీ పోప్, హేరీ బ్రూక్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
భారత్ భారీ ఆధిపత్యం..
అంతకుమందు ఓవర్ నైట్ స్కోరు 64/1 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా.. తన రెండో ఇన్నింగ్స్ ను ఆరు వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (161) మరోసారి సెంచరీతో సత్తా చాటాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్ గా నిలిచాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అద్భుతమైన ఫిప్టీతో రాణించగా, ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 పరుగులతో కలుపుకుని ఓవరాల్ గా 608 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ కు నిర్దేశించింది. ఇక రేపు ఆటకు చివరి రోజు కావడంతో మిగతా వికెట్లను తీసి, రెండో టెస్టును కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అంతకుముందు తొలి టెస్టును ఇంగ్లాండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.