టీమిండియా(Team India) సఫారీ గడ్డపై  నయా చరిత్ర సృష్టించింది. కేవలం రోజున్నరలోనే ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa)పై ఘన విజయం సాధించింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా సీమర్లు నిప్పులు చెరిగిన వేళ రోహిత్‌ సేన విజయదుంధుభి మోగించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. దక్షిణాఫ్రికా ఇచ్చిన  79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలోనే ఛేదించింది.  తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సిరాజ్‌ నిప్పులు చెరగగా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో బుమ్రా ప్రొటీస్‌ పతనాన్ని శాసించాడు. 107 ఓవర్లలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 33 వికెట్లు నేలకూలగా అన్ని వికెట్లు సీమర్లకే పడ్డాయి. 1935లో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ 109 ఓవర్లలో ముగియగా ఈ మ్యాచ్‌ కేవలం 107 ఓవర్లలోనే ముగిసింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది.  తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల పతనాన్ని శాసించిన మహ్మద్‌ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.


కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. చెలరేగిన సిరాజ్ ధాటికి దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. సిరాజ్‌ ఆరు వికెట్లతో ప్రొటీస్‌ పనిపట్టాడు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి ప్రొటీస్‌ 55 పరుగులకే కుప్పకూలడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. 


అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా 153 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.  


ఓవర్‌నైట్‌ స్కోరు 62 పరుగులకు మూడు వికెట్ల నష్టంతో రెండో రోజూ ఆట కొనసాగించిన ప్రొటీస్‌... బుమ్రా ధాటికి 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. వరుసగా వికెట్లు పడుతున్నా మార్‌క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు బుమ్రా వరుసగా వికెట్లు తీస్తున్నా...మరోవైపు ఎదురుదాడికి దిగి ప్రొటీస్‌కు ఆ మాత్రం స్కోరైనా అందించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసిన మాక్రమ్‌... 103 బంతుల్లో 17 ఫోర్లు రెండు సిక్సులతో 106 పరుగులు చేశాడు. ప్రొటీస్‌ చేసిన 153 పరుగుల్లో 106 పరుగులు మార్‌క్రమే చేశాడు. 99 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న మార్క్‌రమ్‌.. సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యం అందించాడు.  రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా . ఆరు వికెట్లు నేలకూల్చి దక్షిణాఫ్రికా పతనాన్నిశాసించాడు.  అనంతరం 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.