IND vs ZIM Dream11 Prediction: జింబాబ్వే(ZIM)తో కీలకమైన మూడో టీ 20 మ్యాచ్‌కు టీమిండియా(India) సిద్ధమైంది. ఇరు జట్లు చెరో మ్యాచ్‌లు గెలిచి సమఉజ్జీలుగా ఉన్న వేళ... ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిపత్యం సంపాదించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన జింబాబ్వేను... రెండో మ్యాచ్‌లో టీమిండియా చిత్తు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ శతక గర్జన చేయడంతో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక మళ్లీ గాడిన పడ్డ భారత్‌ను అడ్డుకోవడం జింబాబ్వేకు అంత తేలికగా కనిపించడం లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్న గిల్‌ సేనను.. సికిందర్‌ రజా నేతృత్వంలోని జట్టు ఎంత వరకు ఎదురు నిలుస్తుందో చూడాలి. 

 

జైస్వాల్‌ వచ్చేస్తాడా..?

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ జైస్వాల్‌ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అభిషేక్‌ శర్మ ఇప్పటికే శతకంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో యశస్వీ జైస్వాల్‌ను జట్టులోకి తీసుకుంటారా... తీసుకుంటే ఏ స్థానంలో బరిలోకి దింపుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. టీ 20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబేల రాకతో టీమిండియా ఫైనల్‌ 11 ఎంపిక కష్టతరంగా మారింది. ఈ సిరీస్‌లో కీలకమైనదిగా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో ఫైనల్‌ లెవన్‌లో ఎవరికో చోటు దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

 

అభిషేక్‌పై వేటేనా..?

యశస్వీ జైస్వాల్‌ ఇప్పటివరకూ 17 టీ 20 మ్యాచులు ఆడి 161కుపైగా స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, నాలుగు సెంచరీలు చేశాడు. కాబట్టి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే గిల్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వెళ్లి అభిషేక్‌ను- జైస్వాల్‌ను ఓపెనింగ్‌కు పంపుతాడేమో చూడాలి. ఒక అద్భుత ఇన్నింగ్స్ తర్వాత తదుపరి మ్యాచ్‌లో బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం అసాధారణం కాదు. కాబట్టి అభిషేక్‌ను ఈ మ్యాచ్‌కు పక్కనపెట్టే అవకాశం ఉంది. 2011లో వెస్టిండీస్‌పై తొలి వన్డే సెంచరీ చేసిన వెంటనే మనోజ్ తివారీని తర్వాతి మ్యాచ్‌కు పక్కన కూర్చోబెట్టారు. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత ఆ తర్వాతి మ్యాచ్‌కు జట్టులో స్థానం దక్కలేదు. కానీ అభిషేక్‌కు అలా జరిగే అవకాశం లేదు. రాజస్థాన్ రాయల్స్ తరఫున నెంబర్‌ 3లో బ్యాటింగ్ చేసే సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చచు. రుతురాజ్‌ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. కీపర్‌గా ధృవ్ జురెల్ స్థానంలో శాంసన్ జట్టులోకి రానున్నాడు. శివమ్‌ దూబే.. రియాన్ పరాగ్ స్థానంలోకి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

జింబాబ్వే తొలి మ్యాచ్‌లో 115 పరుగులు, రెండు మ్యాచ్‌లో 134 పరుగులు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ ట్రాక్‌లో స్పిన్నర్ల అనుకూలంగా ఉంటోంది. ఇక్కడ రవి బిష్ణోయ్ 8 ఓవర్లలో ఆరు వికెట్లు తీశాడు. కాబట్టి జింబాబ్వే స్పిన్నర్లు రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు మరో షాక్‌ ఇవ్వాలని జింబాబ్వే చూస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత రెండో మ్యాచ్‌లో టీమిండియా వంద పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

 

భారత జట్టు: 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్‌పాండే.

 

జింబాబ్వే: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ మౌజరాబ్, బ్లెస్సింగ్, రిచర్డ్ నగరవ, మిల్టన్ శుంబా.