IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav | భారత్, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కావడం భారత్కు కలిసిరానుంది.

IND vs NZ T20 World Cup 2026 Final: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మెగా మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టీ20 ఇంటర్నేషనల్లో ముఖాముఖీ పోరులో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. అయితే బ్యాటింగ్లో నిలకడగా రాణించి, పరుగుల వరద పారించిన ఆటగాళ్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పొందారు.
సూర్యకుమార్ యాదవ్ అద్భుత రికార్డు
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్పై టీ20లో అసాధారణ రికార్డును కలిగి ఉన్నారు. సూర్యకుమార్ 2021 నుండి 2026 మధ్య ఆడిన 13 మ్యాచ్ల్లో 526 పరుగులు చేశారు. కివీస్ జట్టుపై SKY సగటు 58.44గా ఉండగా, స్ట్రైక్ రేట్ 170.77గా ఉంది. ఇది టీ20 క్రికెట్లో ఎంతో మెరుగైన ప్రదర్శనగా చెప్పవచ్చు.
సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్పై ఒక సెంచరీతో పాటు 4 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. సూర్య అత్యధిక స్కోరు నాటౌట్ 111 పరుగులు. అతడి దూకుడు బ్యాటింగ్ స్టైల్ ఫైనల్లోనూ భారత జట్టుకు కీలకం కానుంది.
రోహిత్ శర్మ
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ న్యూజిలాండ్పై 17 టీ20 మ్యాచ్ల్లో 511 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ సగటు 34.06, స్ట్రైక్ రేట్ 141.16గా ఉంది. రోహిత్ శర్మ ఈ జట్టుపై 6 అర్ధ సెంచరీలు సాధించాడు. అతడి అనుభవం, పెద్ద మ్యాచ్ల్లో ఆడే సామర్థ్యం భారత్కు ఎప్పుడూ కీలకం అయింది.
న్యూజిలాండ్ బ్యాటర్లు సైతం మెరుగైన రికార్డు..
న్యూజిలాండ్ తరపున కొలిన్ మన్రో భారత్పై 12 టీ20 మ్యాచ్ల్లో 426 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ సుమారు 149గా ఉండటంతో పాటు ఒక సెంచరీ సాధించాడు.
కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ భారత్పై 15 మ్యాచ్ల్లో 425 పరుగులు చేశాడు. అతడి దూకుడు బ్యాటింగ్ పలుమార్లు భారత బౌలర్లకు సవాలుగా మారడం తెలిసిందే.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. భారత్పై 13 మ్యాచ్ల్లో కేన్ విలియమ్సన్ 419 పరుగులు చేసి, పలు సందర్భాల్లో కివీస్ జట్టును ఆదుకున్నాడు.
ఫైనల్లో బ్యాటర్లపైనే అందరి కళ్లు
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో పలువురు బ్యాటర్ల ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పెద్ద గ్రౌండ్ అయినప్పటికీ, ఇక్కడ పలుమార్లు భారీ స్కోర్లు నమోదయ్యాయి. భారత్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి దూకుడుగా ఆడే బ్యాటర్లపై ఆశలు పెట్టుకుంది. చివర్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే ఎలాగూ తమ వంతు పాత్ర పోషించనున్నారు. న్యూజిలాండ్ సైతం బెస్ట్ బ్యాటింగ్ ఆటగాళ్లతో పరుగుల వరద పారించేందుకు సిద్ధంగా ఉంది. ఎలాగైనా సరే ఫైనల్లో భారత్ను ఓడించి తొలిసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో నేటి రాత్రి జరగనున్న పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో పరుగుల వరద ఖాయమనిపిస్తోంది. నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు చేయక తప్పదని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు

















