Hardik Pandya Health Update: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది. అప్రతిహాత జైత్రయాత్రతో దాదాపుగా సెమీస్‌కు చేరువైంది. ఈ సమయంలో స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా గాయం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెట్టింది. జట్టు సమతుల్యత దెబ్బతిని, ఫైనల్‌ 11పై అనేక సందేహాలను లేవనేత్తింది. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు శుభవార్త అందింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కీలక సమయంలో అతడు జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్‌ పాండ్యా చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పాండ్యా ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. 


జాతీయ క్రికెట్‌ అకాడమీలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న హార్దిక్‌ పాండ్యా ఇప్పటికే రెండు నెట్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడని, అయితే, తను ఎప్పుడు తిరిగి వస్తాడో కచ్చితంగా చెప్పడం కష్టమని కానీ.. నాకౌట్స్‌ వరకు పూర్తిగా కోలుకునే అవకాశం మాత్రం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గాయం నుంచి కోలుకుంటున్నా హార్దిక్‌ పూర్తిగా ఫిట్‌గా లేడని, నాకౌట్ మ్యాచులో సమీపిస్తున్న వేళ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ సెమీస్‌ మ్యాచ్‌లు మొదలయ్యే సరికి పాండ్యా ఫిట్‌నెస్‌ను సాధించి  జట్టులోకి రావాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్‌ పాండ్యా.. నొప్పి నుంచి ఉపశమనం పొంది ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌ ఆరంభించినట్లు తెలుస్తోంది. లీగ్‌ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకుని.. నవంబరు 15 నాటికి జట్టుతో చేరే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే మాత్రం హార్దిక్‌ రికవరీ గురించి తమకు ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందలేదని పేర్కొనాడు. మరో రెండు రోజుల్లో హార్దిక్‌ గురించి అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 


లీగ్ దశలో భారత జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమిండియా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబరు 2న ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా నవంబర్‌ అయిదున తలపడనుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లతో లీగ్‌ మ్యాచ్‌లను రోహిత్‌ సేన ముగించుకుని సెమీస్‌లో అడుగుపెట్టనుంది. 2023లో నవంబరు 15న తొలి సెమీ ఫైనల్‌, 16న రెండో సెమీస్‌ మ్యాచ్‌, 19న ఫైనల్‌ జరుగనున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా లీగ్‌ మ్యాచ్‌లలో దేనిలోనూ ఆడడు. అతను నేరుగా సెమీఫైనల్ మ్యాచ్‌లో తిరిగి వస్తాడని తెలుస్తోంది.


బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన అతడు తన ఓవర్‌ మధ్యలోనే మైదానం వీడాడు. హార్దిక్ పాండ్యా తన మొదటి ఓవర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని పాదం జారిపోవడంతో అతని ఎడమ చీలమండకు గాయమైంది. దీంతో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పాండ్యా ఓవర్‌ను పూర్తి చేశాడు. స్కాన్ తర్వాత హార్దిక్ పాండ్యా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో హార్దిక్‌ పాండ్యా మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు సైతం ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ దూరమయ్యాడు.


పాండ్యా లేకపోవడంతో భారత జట్టు తమ లైనప్‌లో కొన్ని మార్పులు చేసింది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచుల్లో తొది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీలను తీసుకున్నారు. ఈ రెండు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. మొదటి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌పై ఉన్న షమీ, న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లు పడగొట్టడం, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు.