Shubman Gill Reveals Rahul Dravid's Words to Him: రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో విజయంతో ఇంగ్లాండ్‌(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. బ్రిటీష్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవడంపై టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అండగా నిలవకపోతే ఏదీ సాధ్యమయ్యేది కాదని అన్నాడు.



గిల్‌ ఏమన్నాడంటే..
టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి  టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనను నిరంతరం ప్రోత్సహించేది ద్రవిడే అని సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మీరు కాకపోతే ఎవరు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌ అని ఆ పోస్ట్‌లో గిల్‌ రాశాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు గిల్‌ గత 12 ఇన్నింగ్స్‌లో కనీసం అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. అయినా రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి అండగా నిలిచారు. అనంతరం వైజాగ్‌ టెస్టులో సెంచరీ చేసి తిరిగి గాడిన పడ్డ గిల్‌ ఆ తరువాత మూడో టెస్టులో 90 పరుగులతో ఫామ్‌ను అందుకున్నాడు. నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ జట్టును గెలిపించాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 48 సగటుతో 342 పరుగులు చేశాడు.


రోహిత్‌ ఏమన్నాడంటే..?
బ్రిటీష్‌ జట్టుపై ఘన విజయం సాధించిన అనంతరం భారత జట్టు సారధి రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకొంటామని హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని అద్భుతంగా ఆడిన ధ్రువ్‌ జురెల్‌పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు సిరీస్‌లో అద్భుత పోరాటంతో యువ ఆటగాళ్లు సత్తా చాటారాన్న రోహిత్‌... మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు.


ఆధిపత్యం ప్రదర్శించాం
మైదానంలో మేం ఎలా ఆడాలని భావించామో.. అదే తీరులో ఆధిపత్యం ప్రదర్శించామని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడి నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్లూ సత్తా చాటారని హిట్‌మ్యాన్‌ కొనియాడాడు. యువ క్రికెటర్లకు స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయగలగడంలో తాను, కోచ్‌ ద్రావిడ్‌ విజయవంతం అయ్యామని రోహిత్‌ తెలిపాడు. రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ ఏ ఒత్తిడికి గురికాకుండా గొప్ప పరిణితి ప్రదర్శించాడని హిట్‌ మ్యాన్‌ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీతో సహా సీనియర్లు వచ్చినప్పుడు జట్టులో మార్పుల గురించి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని రోహిత్‌ స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్‌లోనూ ఉత్సాహంగా బరిలోకి దిగుతామని రోహిత్ వెల్లడించాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌..తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్‌ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్‌ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని... బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు.