బీజింగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలంపిక్స్ ప్రారంభం సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ విడుదల చేసింది. ఈ యానిమేటెడ్ డూడుల్‌ను గూగుల్ ఒలంపిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మొత్తం ఆరు క్యూట్ యానిమల్స్‌ను డిస్‌ప్లే చేశారు. స్నోబోర్డింగ్ లెపర్డ్, ఐస్ డ్యాన్సింగ్, కర్లింగ్ మౌస్, హాకీ ఆడే నక్కలు, స్కీయింగ్ చేస్తున్న బాతులు కూడా ఇందులో ఉన్నాయి.


ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. బర్డ్స్ నెస్ట్ అనే పేరున్న నేషనల్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్నాయి. మొత్తంగా 90 దేశాల నుంచి 3,000 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అయితే భారత్ నుంచి మాత్రం ఒక్క అథ్లెట్ మాత్రమే ఇందులో పాల్గొననున్నారు. అంతర్జాతీయ స్కీయర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.


క్రాస్ కంట్రీ స్కీయింగ్, స్పీడ్ స్కేటింగ్, స్కీ జంపింగ్, ఫ్రీ స్టైల్ స్కీయింగ్ గేమ్స్‌లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 2020లో గాల్వాన్ వివాదాల్లో భాగమైన చైనీస్ సైనికుడు టార్చ్‌బేరర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో భారత్ ఆయా పోటీల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది.


అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా దౌత్యపరంగా ఈ గేమ్స్‌ను బహిష్కరించారు. ఈ దేశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడల్లో పాల్గొంటారు, కానీ గేమ్స్‌కు సంబంధించిన సెరెమోనీల్లో పాల్గొనబోరు. సమ్మర్, వింటర్ ఒలంపిక్స్ రెండిటినీ నిర్వహించిన దేశంగా చైనా నిలిచింది. గతంలో 2008 సమ్మర్ ఒలంపిక్స్‌ను బీజింగ్ నిర్వహించింది.