Bajrang Punia Suspended: ఒలింపిక్స్‌ ట్రయల్స్‌కు ముందు ప్రముఖ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా(Bajrang Punia)కు షాక్‌ తగిలింది. బజరంగ్‌ పూనియాపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ నాడా(NADA ) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చిలో జరిగిన ట్రయల్స్‌లో డోప్‌ పరీక్షకు నమూనాను ఇచ్చేందుకు బజరంగ్‌ పూనియా నిరాకరించడంతో నాడా తాత్కాలింగా సస్పెన్షన్‌  వేటు వేసింది. ఈ ట్రయల్స్‌లో రెజ్లర్‌ రోహిత్‌పై ఓడిపోయిన అనంతరం మూత్ర నమూనాను ఇవ్వడానికి బజరంగ్‌ నిరాకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 10 న డోపింగ్‌ పరీక్షకు శాంపిల్‌ను ఇవ్వమని బజరంగ్‌ను కోరామని దానికి అతడు నిరాకరించాడని నాడా  అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ వాడాకు తెలిపింది. ఈ అంశంపై బజరంగ్‌ పునియాకు నోటీసులు జారీ చేసిన నాడా మే 7 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులపై ఇంతవరకూ పునియా స్పందించలేదని ఆ కారణంగానే అతడిపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు నాడా తెలిపింది. నాడా నిషేధంతో ఈ ఏడాది జరగనున్న ఒలంపిక్స్‌కు బజరంగ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


అసలేం జరిగిందంటే.. 


మార్చిలో సోనిపట్‌లో జరిగిన ట్రయల్స్‌లో బజరంగ్ పునియా రోహిత్ కుమార్‌పై ఓడిపోయాడు. ఆ తర్వాత బజరంగ్ వెనువెంటనే  మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది.  అయితే బజరంగ్ యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించాడంట. ఆ తరువాత,  ఒక అథ్లెట్ తన నమూనా ఇవ్వలేదని NADA ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(WADA)కి తెలియజేసిందట. తరువాత కూడా వారి మధ్య పలు  చర్చలు జరిగాయి.  అసలు అతను పరీక్షకు ఎందుకు నిరాకరించాడో సమాధానం కోరుతూ  WADA నోటీసు జారీ చేయమని NADAని కోరింది.  అయితే ఆ నోటీసులకి కూడా అతను  సమాధానం ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 23న, నాడా మళ్లీ బజరంగ్ పునియాకు నోటీసు  పంపింది. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ మే 7 లోగా సమాధానం ఇవ్వవలసి ఉంటుందని పేర్కొంది. బజరంగ్ సమాధానం ఇవ్వని వరకు, అతనిపై  నిషేధం కొనసాగుతుంది.   


 ప్రస్తుత  ఉన్న సమాచారం మేరకు పూనియా ఇకపై ఏ టోర్నీలో పాల్గొనలేడు.  పూనియా కేసు ఇప్పుడు  తక్షణం విచారించే అవకాశం ఉంది. కానీ విచారణ ఒక వేళ చాలా కాలం పాటు కొనసాగితే మాత్రం , అప్పుడు పూనియా ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కూడా ఉండదు.


వినేశ్‌ ఫొగాట్‌కు ఒలింపిక్‌ బెర్తు 


భారత స్టార్‌ రెజ్లర్‌, రెండుసార్లు ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat)  వరుసగా మూడోసారి ఒలింపిక్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఆసియా ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకోవడం ద్వారా వినేశ్‌  పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది.  సెమీఫైనల్లో లారా గనికీజీపై 10-0తో ఘన విజయం సాధించి  వినేశ్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో భారత మహిళ రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ నిలిచింది. 2016 రియో గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న వినేశ్‌.. వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్తు సాధించింది.