PV Sindhu lost her doubles match But:  భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్(Badminton Asia Team Championships 2024) ఫైనల్లో అడుగు పెట్టింది. తొలుత సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 13-21, 20-22 తేడాతో అయా ఒహోరి చేతిలో ఓడింది. దీంతో జపాన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్ లో భారత జోడీ త్రిసా-గాయత్రీ గోపిచంద్ అద్భుతంగా అడి... నమీ మత్సుయమ-చిహారుపై 21-17, 16-21, 22-20 తేడాతో విజయం సాధించింది. దీంతో ఇరు జట్లూ.. 1-1తో సమంగా నిలిచాయి. మరో మ్యాచ్ లో జపాన్ కు చెందిన నొజోమి ఒకుహరపై 21-17, 21-14 తేడాతోగెలిచిన అష్మిత భారత్ ఆధిక్యాన్ని 2-1కు చేర్చింది. అయితే అశ్విని పొన్నప్ప-PV సింధు జోడీపై 21-14, 21-11తో మియుర- సుకురమోటో విజయం సాధించడంతో..భారత్-జపాన్ 2-2తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో భారత యువషట్లర్ అనమోల్ 52 నిమిషాలపాటు పోరాడి వరల్డ్ 29వ ర్యాంకర్ నత్సుకిపై.... 21-14, 21-11 తో గెలిచింది. తద్వారా 3-2 తేడాతో భారత్ మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఆసియాటీమ్ ఛాంపియన్ షిప్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 

ఫైనల్స్‌ చేరారిలా
క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 3-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది. గ్రూపు దశలో టాప్‌ సీడ్‌ చైనాను చిత్తుచేసిన పి.వి.సింధు బృందం.. క్వార్టర్స్‌లో హాంకాంగ్‌ను మట్టికరిపించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ తొలి పోరులో రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించిన సింధు 21-7, 16-21, 21-12తో లో సిన్‌ యాన్‌పై గెలిచి బోణీ కొట్టగా.. డబుల్స్‌ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీ 21-10, 21-14తో యెంగ్‌ నెగా టింగ్‌-యెంగ్‌ లామ్‌ ద్వయంపై గెలుపొందింది. మరో సింగిల్స్‌ మ్యాచ్‌లో యువ షట్లర్‌ అష్మిత చలిహ 21-12, 21-13తో యెంగ్‌ సుమ్‌ యీపై నెగ్గింది. దీంతో 3-0తో భారత్‌ విజయభేరి మోగించింది. సెమీస్‌లో జపాన్‌తో భారత్‌ తలపడనుంది.



చైనాకు షాక్‌ ఇచ్చారిలా....
ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనా(China)కు భారత్‌(Bharat) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్స్‌-2024 టోర్నీలో టాప్‌ సీడ్‌ చైనా జట్టును మట్టికరిపించి టేబుల్‌ టాపర్‌గా నిలిచి క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. స్టార్‌ షట్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు అద్భుత ఆటతీరుతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్‌- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్‌ హాన్‌ యేతో తలపడింది. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సింధు 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అక్టోబర్‌ నుంచి టోర్నీలకు దూరంగా ఉన్న సింధు సింగిల్స్‌ పోరులో హాన్‌ యుపై గెలిచింది. నలభై నిమిషాల పాటు సాగిన పోరులో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది.