Tirumala Latest News | తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెల దర్శన కోటా విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. సెప్టెంబర్ 18 నుంచి డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనాల టోకెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ (TTD) గురువారం నుంచి విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరు చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.
22న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
22న వర్చువల్ సేవల కోటా విడుదల
సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి దర్శన కోటా
డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 23న ఉదయం 11 గంటలకు టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.