TTD Board Meeting : సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ విధానం, నడక దారి భక్తులకు టోకెన్ల జారీ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువ గల 10 ఎకరాల స్థలాన్ని ముంబయిలో కేటాయించిందని ఆయన వివరించారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, ఆలయ నిర్మాణం చేపడుతామని అన్నారు. 


మే 5న గరుడ వారధి ప్రారంభం 


ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులను అనుమతిస్తామని, శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహాసనాలు తయారు చేయనున్నట్లు చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజిలో 21 కోట్ల రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదించిందన్నారు. శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని, మే 5వ తేదీన సీఎం జగన్ చేతులు మీదుగా గరుడ వారధిని ప్రారంభిస్తామని తెలిపారు. గరుడ వారధి రెండో దశ పనులకు 100 కోట్లు కేటాయించామన్నారు. మార్చి 2023కి పనులు పూర్తి చేస్తామన్నారు. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండు దశలలో 36 కోట్లు కేటాయింపుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. 


టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు 


తిరుమలలో వసతి గదులు మరమత్తులకు రూ.19 కోట్లు కేటాయించగా, బాలాజీ నగర్ లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 437 మంది ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతులకు నిర్ణయం తీసుకున్నామని, వస్తు రూపంలో విరాళాలు అందించే భక్తులకు ప్రివిలేజస్ అందజేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే జరుగుతుందన్నారు. స్విమ్స్ లో 300 పడకల క్యాన్సర్ విభాగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5 వ తేదీన సీఎం జగన్ ఐదు కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. అన్నమయ్య నడకమార్గం అభివృద్ధి పనులకు ఇంకా అనుమతులు రాలేదన్నారు.