యేసు క్రీస్తుకు ముందు, ఆ తర్వాత సిలువ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?

సిలువ వేయడాన్ని క్రూసిఫికేషన్ అని కూడా అంటారు. ఈ పద్దతిలో శిక్షించడం చాలా అనాగరికరమైన శిక్షగా చరిత్ర కారులు చెబుతారు. అత్యంత క్రూరమైన నేరాలు,  దేశ ద్రోహం ,  తిరుగుబాటు దారులకు, బందిపోటులకు  ఇలాంటి శిక్షలు వేసినట్లు ప్రపంచ చరిత్ర చెబుతోంది.  రోమన్లు  ఈ శిక్షను విస్తృతంగా వాడుకలోకి తెచ్చినప్పటికీ క్రీస్తు పూర్వం నుండి ఈ సిలువ శిక్ష అనేది  ప్రారంభమైనట్లు చరిత్ర పరికిస్తే అర్థం అవుతుంది.

 ఈ సిలువ శిక్ష ఎప్పుడు ప్రారంభం అయిందంటే...?

నేరస్థులను సిలువ వేయడం అనేది పర్షియన్ల కాలంలో అంటే క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ధంలో సిలువ వేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.  పర్షియన్ సామ్రాజ్యంలో  నేరస్థులను చెక్క కొయ్యలు, లేదా స్తంభాలకు వేలాడి దీసి శిక్షించే వారు. ఇది  పర్షియన్ సామాజ్రంలో క్రీ. పూ. సుమారు 559 నుండి 339 వరకు  సాగినట్లు  చరిత్ర చెబుతోంది.  పర్షియన్ రాజు డేరియస్ 1  క్రీ. పూ 522 నుండి 436 వరకు చాలా మందిని సిలువ వేసి శిక్షించినట్లు  గ్రీకు చరిత్ర కారుడు  హెరోడోటస్  తన రచనలలో ఉదాహరించడం జరిగింది.  అయితే రోమన్లు సిలువ పై మేకులు కొట్టి  వేలాడ దీసేవారు. పర్షియన్లు మాత్రం తాళ్లతో కట్టి వేలాడి దీసి చనిపోయే వరకు సిలువపై  ఉంచే వారు. ఇలా  క్రీ. పూర్వం ఆరో శతాబ్దం నుండే  ఈ సిలువ శిక్ష ప్రారంభమైంది.

ఫోనిషయన్లు - కార్తాజీనియన్లు, అలెగ్జాండర్  కాలంలో  

 పర్షియన్ల తర్వాత  క్రీ. పూ 1200 నుండి 539 వరకు ఫోనీషియన్లు,  క్రీ. పూ 814 నుండి 146 వరకు  కార్తాజీనియన్లు కూడా సిలువ వేసే శిక్షను నేరస్థులకు విధించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఇవి కేవలం నేరస్థులకు మాత్రమే కాకుండా కార్తాజీనియన్లు సైనికులను కూడా యుద్ధాల్లో ఓడినా, యుద్ధం నుండి పారిపోయినా  సిలువ వేసి చంపే శిక్షను అమలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. వీరి తర్వాత గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఈ సిలువ శిక్షను అమలు చేసినట్లు రుజువులున్నాయి.  క్రీ. పూ 336 నుండి 323 వరకు ఈ సిలువ శిక్షను  అలెగ్జాండర్ తన శత్రువులకు, తన  ఆధిపత్యాన్ని  ఎదిరించే తిరుగుబాటు దారులకు అమలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 

సిలువ శిక్షను క్రూరంగా అమలు చేసిన రోమన్లు...

 అలెగ్జాండర్ ద్రి గ్రేట్ తర్వాత రోమన్ సామ్రాజ్యం విశ్వవ్యాప్తం అయింది.   క్రీ. శ 3వ శతాబ్దం నుండి 4 వ శతాబ్ధం వరకు సిలువ శిక్షను రోమన్లు తమ సామ్రాజ్యంలో  అత్యంత క్రూరంగా అమలు చేశారు.  నేరస్థులకు, తిరుగుబాటుదారులకు , దేశ ద్రోహానికి పాల్పడిన వారికి ఈ శిక్షను అమలు చేసే వారు. అయితే వీరు సిలవను వేసే పద్దతి కొంత  మార్చారు. తాళ్లతో చెక్కలపై వేలాడదీయడం కాకుండా  చేతుల్లో, కాళ్లలో మేకులు కొట్టేవారు. యేసు క్రీస్తును కూడా ఇలానే  సిలువ వేశారని బైబిల్ గ్రంధం చెబుతోంది.  ఇది క్రీ. శ 30 -33 మధ్యలో జరిగిందని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.  ఆతర్వాత స్పార్టకస్ తిరుగబాటు  క్రీ.శ 73-71 కాలంలో జరిగింది.  ఆ తిరుగుబాటును అణిచివేసిన తర్వాత రోమన్లు అప్పియన్ వే దారి గుండా  ఆరు వేల మంది బానిసిలను అత్యంత క్రూరంగా  సిలువ వేసి చంపినట్లు రోమన్ చరిత్ర చెబుతోంది.

సిలువ శిక్షను రద్దు చేసింది కూడా రోమన్ చక్రవర్తే..

రోమన్లు  అత్యంత క్రూరంగా అమలు చేసే ఈ సిలువ శిక్ష రద్దు కూడా ఓ విశేషంగా చెప్పాలి. దీన్ని అమలు చేసింది కూడా  రోమన్ చక్రవర్తే. అదేంటో ఇప్పుడు చూద్దాం. కాన్ స్టంటైన్ ది గ్రేట్ గా చెప్పబడే ఈ చక్రవర్తి  క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరిగింది. అప్పటి వరకు క్రైస్తవులను హింసించిన చరిత్ర రోమన్ పాలకులది. అలాంటిది అనూహ్యంగా కాన్ స్టంటైన్ కాలంలో అంటే క్రీ. శ. 272 నుండి 337 వరకు రోమన్ స్రామ్రాజ్య పాలకుడు. ఆయన క్రీ. శ 312 లో  మిల్వియన్ వంతెన యుద్దంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఆకాశంలో సిలువ ఆకారంలో వెలుగును చూశారు.  ఈ చిహ్నంతో యుద్దంలో పాల్గొంటే నీవు విజయాన్ని సాధిస్తావు అన్న  సందేశం  ఆయనకు కనిపించిందని, దాంతో ఆయన తన సైనికుల డాళ్లపైన, జెండాల పైన సిలువ ముద్ర వేసి ఆ యుద్దంలో విజయం సాధించారని చరిత్ర కారులు చెబుతారు.  ఆ విజయంతో ఆయన , ఆయన తల్లి హెలెనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు. అప్పటి నుండి సిలువను ఓ పవిత్రమైన చిహ్నంగా గుర్తించి గౌరవిస్తారు. అప్పటి నుండే  కాన్ స్టంటైన్ చక్రవర్తి సిలువ శిక్షను రద్దు చేయడం జరిగిందని చరిత్ర చెబుతోంది.