YSRCP 7th List: అమరావతి: వైనాట్ 175 అంటున్న అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) ఇదివరకే సమన్వయకర్తల 6 జాబితాలు విడుదల చేసింది. దాదాపు రెండు వారాల తరువాత వైసీపీ 7వ జాబితా విడుదల చేసింది. కేవలం 2 నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy). ప్రకాశం జిల్లాలో పర్చూరు, కందుకూరు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్లను (YSRCP new incharges) ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరకు పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ లను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని మార్పు చేశారు. ఈ స్థానంలో మహిళా నేత అరవిందా యాదవ్ ను ఇంఛార్జ్గా నియమించారు. పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాంతో ఎడం బాలాజీకి పర్చూరు బాధ్యతల్ని అప్పగించారు.
జాబితాల వారీగా ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారంటే... ఇంఛార్జ్ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. తాజాగా 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు.