YSRCP is left without a single ally at the national level : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026 పార్లమెంటులో ఆమోదం పొందడం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల రాజకీయ వ్యూహానికి తగిలిన కోలుకోలేని దెబ్బ. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతుగా నిలిచాయి.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి కనీసం గళం కలిపే మిత్రులు లేకపోవడం జగన్ రాజకీయ పరపతి ఏ స్థాయిలో పడిపోయిందో స్పష్టం చేస్తోంది.

Continues below advertisement

 మిత్రపక్షాల నమ్మకం కోల్పోయిన వైనం

గతంలో ఢిల్లీ వేదికగా జగన్ నిర్వహించిన ధర్నాలకు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వంటివి సంఘీభావం తెలిపాయి. కానీ అమరావతి బిల్లు విషయంలో అవే పార్టీలు వైసీపీకి కనీస మద్దతు కూడా ప్రకటించలేదు. రాజ్యసభలో కీలక బిల్లుల సమయంలో బీజేపీకి అండగా నిలిచిన జగన్, అవసరమైనప్పుడు ఇండియా కూటమి నేతలను సంప్రదించడంలో విఫలమయ్యారు. ఈ ద్వంద్వ వైఖరి వల్ల జాతీయ నేతలు జగన్ రెడ్డిని నమ్మకూడదని నిర్ణయించుకున్నారు. ఫలితంగా పార్లమెంటులో వైసీపీ వాదన వినిపించడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

Continues below advertisement

 మూడు రాజధానుల సిద్ధాంతానికి పార్లమెంటు చరమగీతం

మూడు రాజధానుల నినాదంతో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా బలపడ్డాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల సిద్ధాంతాన్ని దేశవ్యాప్త పార్టీలు ఏకగ్రీవంగా తిరస్కరించినట్లయింది. వైసీపీ ఎంపీలు సభలో నిలబడి తమ వాదన వినిపించే ధైర్యం చేయలేకపోయారు. చర్చ నుంచి వాకౌట్ చేసి పారిపోవడం జగన్ పంతానికి ఎదురైన పరాజయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 దెబ్బతిన్న జాతీయ ప్రతిష్ఠ

రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తర్వాత జగన్ తన అవసరాలకు తగ్గట్టుగా అటు బీజేపీకి, ఇటు విపక్షాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏ పక్షానికీ ఆయన పూర్తిస్థాయి మిత్రుడు కాలేకపోయారు. అమరావతి బిల్లు రూపంలో ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి ఏ ఒక్క పార్టీ కూడా వైసీపీ పక్షాన నిలబడలేదు. ఒకప్పుడు చక్రం తిప్పాలని భావించిన నేతకు ఇప్పుడు ఢిల్లీలో కనీసం మాట వినే నాథుడు లేని స్థితి రావడం ఆశ్చర్యకరం.

 జగన్ చాణక్యం విఫలం 

అమరావతి బిల్లు ఆమోదం పొందడం ద్వారా జగన్ ఐదేళ్ల పాలన, ఆయన రాజకీయ చాణక్యం రెండూ విఫలమయ్యాయని తేలిపోయింది. ఇది కేవలం రాజధాని అంశం మాత్రమే కాదు, భవిష్యత్తులో వైసీపీ జాతీయ రాజకీయాల్లో ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులకు ముందస్తు హెచ్చరిక. రాష్ట్రంలో అధికారం కోల్పోయి, కేంద్రంలో మిత్రులు లేక వైసీపీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. సొంత పార్టీ నేతలు సైతం జాతీయ స్థాయిలో ఎదురైన ఈ అవమానాన్ని చూసి నిర్వేదంలో మునిగిపోయారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం ఏపీకి ఒకే రాజధాని ఉండాలని, అమరావతికి న్యాయం జరగాలని కోరడం జగన్ రెడ్డికి వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే జాతీయ స్థాయిలో కూడా మద్దతు లభించదని ఈ పరిణామం రుజువు చేసింది. ఐదేళ్ల పాటు సాగించిన వింత ప్రయోగాలు ఏపీ ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, వైసీపీని రాజకీయంగా ఏకాకిని చేశాయి.