Jagan strategic mistake: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్సార్ కుటుంబ అంతర్గత కలహాలు పెను దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు అభేద్యమైన కోటలా కనిపించిన ఈ కుటుంబంలో ఆస్తి పంపకాలు, వ్యక్తిగత విభేదాలు వీధిన పడటం చర్చనీయాంశంగా మారింది.   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఈ పోరు కేవలం కుటుంబ వ్యవహారంగా మిగిలిపోకుండా రాజకీయ రంగు పులుముకోవడం వల్ల అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, విజయలక్ష్మి పడ్డారంటున్న వైసీపీ 

రాజకీయాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకులకు కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో కీలకం. జగన్ తన సోదరి షర్మిల లేవనెత్తుతున్న ఆస్తి వాటాల అంశాన్ని ప్రతిపక్షాల కుట్రగా భావించడం, చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో ఆమె పడ్డారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపించడం గమనార్హం. వ్యక్తిగత సమస్యలను రాజకీయ కోణంలో ఎదుర్కోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.   తమిళనాడులో కరుణానిధి వారసుల మధ్య జరిగిన ఘర్షణలు, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలు ఆయా పార్టీల ప్రతిష్టను భారీగా దెబ్బతీశాయి. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై పార్టీ నేతలతో విమర్శలు చేయించడం సొంత కేడర్‌ను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రక్తసంబంధీకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో జగన్ పట్ల ఒక రకమైన ప్రతికూల భావన ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

కుటుంబ సమస్యను రాజకీయం చేయడం వ్యూహాత్మక తపపిదం

అమ్మ, చెల్లి ఇద్దరూ ప్రత్యర్థుల చేతిలో పావులుగా మారారనే ప్రచారం సామాన్య ఓటర్లలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. తన సొంత కుటుంబ సభ్యులనే ఒప్పించలేని,  మెప్పించలేని నాయకత్వం రాష్ట్ర ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతాయి. షర్మిల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా రాజకీయ విమర్శలు చేస్తున్నప్పుడు వాటిని రాజకీయంగానే తిప్పికొట్టాలి. అలా కాకుండా ఆస్తుల గొడవను తెరపైకి తెచ్చి ఆమెను వ్యక్తిగతంగా దూషించడం వల్ల వైఎస్సార్‌సీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది తప్ప ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చినట్లు అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

తల్లి, చెల్లితో రాజీ చేసుకుంటేనే రాజకీయ లాభం

కుటుంబ సమస్యలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోకపోవడం వల్ల రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు జగన్ వెనుక కొండంత అండగా నిలిచిన విజయమ్మ, షర్మిల నేడు ఆయనకు దూరంగా జరగడం అనేది భావోద్వేగపూరితమైన ఆంధ్ర ఓటర్ల మనోభావాలను దెబ్బతీస్తుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులతో మైండ్ గేమ్స్ ఆడటం సహజం కానీ, అది కన్నతల్లి, కన్నచెల్లితో సాగితే ప్రజల నుంచి వచ్చే స్పందన మరోలా ఉంటుంది. ఈ వివాదం ఎంత కాలం సాగితే అంతగా వైఎస్సార్ వారసత్వంపై ప్రజలకున్న నమ్మకం సడలిపోయే ప్రమాదం పొంచి ఉంది.   వ్యక్తిగత ఆస్తుల వివాదాలు రాజకీయాల్లోకి చొచ్చుకురావడం వల్ల   ప్రతిపక్ష పార్టీగా ఎలా పని చేస్తున్నారు అనే దానికన్నా.. ఈ వివాదమే హైలెట్ అవుతుంది.  ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గానీ, సంబంధిత రాజకీయ పార్టీకి గానీ  అంత మంచిది కాదు.  జగన్ ఈ అంశాన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక అన్నగా కుటుంబ పరిధిలోనే ముగించుకుంటేనే ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కు మేలు జరుగుతుంది. లేకపోతే ఈ అంతర్గత కలహాలే భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీకి తీరని నష్టం చేకూర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.