Telangana Politics  :   కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి.  ఈ ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీకి జై కొడదామనుకున్న చాలా మంది నేతల  అడుగులు  కాంగ్రెస్ వైపు పడే అవకాశం కనిపిస్తోంది.  అందరికంటే ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన జూపల్లి, పొంగులేటి వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. కర్ణాటక ఎన్నికలఫలితాల తర్వాత జూపల్లి, పొంగులేటి బీజేపీలో చేరాలని డిసైడ్‌ అయ్యారు. వారం క్రితం ఖమ్మంలో బీజేపీ నేతలు పొంగులేటితో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌ లో చేరాలనుకున్న ఆలోచన విరమించుకుని ఇద్దరూ బీజేపీలో చేరేందుకు  చర్చలు జరిపారు. 


ఎటూ తేల్చుకోలేకపోతున్న జూపల్లి , పొంగులేటి                             
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి.. ఎవరికి వారే బాగా పట్టున్న నేతలుకావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం  చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.  అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. అయితే కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఎంత షాకిచ్చాయో.. పొంగులేటి, జూపల్లికి కూడా అంతే షాకిచ్చాయి. శనివారం ఫలితాలు వెల్లడయ్యాక జూపల్లి, పొంగులేటి ఫోన్లో సుదీర్ఘంగా చర్చించుకున్నారని... బీజేపీలో చేరే అంశాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. 


బీజేపీకి ఇక  హైప్ లేనట్లేనని భావిస్తున్నారా?                              


ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్‌ వైపే పొంగులేటి అడుగులు కూడా పడుతున్నాయని సమాచారం. ఇదే బాటలో జూపల్లి కూడా నడవబోతున్నారని అంటున్నారు.  కాంగ్రెస్‌కే జై కొట్టాలని ఇద్దర నేతల అనుచరులు కూడా పట్టుబడటంతో ఆ మేరకు తుది నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకు ముందే ఇద్దరూ కాంగ్రెస్‌ జెండా కప్పుకోవాలి. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే అప్పట్లో బీజేపీ నేతలు వత్తిడి తీసుకురావడంతో ఆలోచన వాయిదా పడ్డప్పటికీ ఇక ఇదే ఫైనల్‌ డెసిషన్‌ అంటున్నారని అంటున్నారు. జూపల్లి, పొంగులేటి మాత్రమే కాదు బీజేపీలో చేరాలని చాలా మంది నేతలు ఉత్సాహపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామని రాష్ట్ర నేతలు ఎప్పటి నుంచో వారందరికీ సర్ది చెబుతున్నారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ లోకి క్యూ కట్టే అవకాశం ఉంది. 


బీజేపీలో చేరికలు ఇక కష్టమే !


బీజేపీని ఎలాగైనా నేతలతో నింపేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.  చేరికల కమిటీకి ఇంచార్జ్ గా ఉన్న ఈటల రాజేందర్ విసుగుపుట్టి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ పెద్దలు సర్ది చెప్పారు. కొంత కాలం ఆగాలన్నారు. ఇప్పుడు ఆయనకు ఇక ఎలాంటి చేరికలు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు జోష్ అంతా కాంగ్రెస్ లోనే కనిపిస్తోంది. కొంత కాలం పాటు బీజేపీ ఈ నిరాశలోనే ఉండనుంది.