Will KCR be disqualified for not attending the assembly: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఏపీలో జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీతో దీన్ని పోలుస్తూ అనర్హతా వేటు వేయవచ్చన్న చర్చ జరుగతోంది. బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకాకపోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గత రెండేళ్లుగా కేసీఆర్ సభకు రావడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఆయన గౌరవించడం లేదని రేవంత్ విమర్శించారు. సభకు రాకుండానే కోట్ల రూపాయల జీతభత్యాలు తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాకను తాము కోరుకుంటున్నామని చెబుతూనే, ఆయన వైఖరిని అహంకారం గా రేవంత్ అభివర్ణించారు.
రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191, 101 ప్రకారం, ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ సభకు ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 60 సభ జరిగిన రోజులు గైర్హాజరైతే, సదరు సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం స్పీకర్కు ఉంటుంది. అయితే, ఈ 60 రోజులను లెక్కించేటప్పుడు సభ వాయిదా పడిన లేదా ప్రోరోగ్ అయిన కాలాన్ని మినహాయిస్తారు. సభకు రానంత మాత్రాన అనర్హత వేటు పడదు, కానీ స్పీకర్ ఆ స్థానాన్ని ఖాళీ గా ప్రకటిస్తే ఉప ఎన్నికకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఏపీలో పరిస్థితి - జగన్ వర్సెస్ స్పీకర్
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , ఇతర 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదన్న నిరసనతో వారు సభను బహిష్కరిస్తున్నారు. దీనిపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. పని చేయని వారికి జీతం లేదు అనే విధానాన్ని తేవాలని, అవసరమైతే రైట్ టు రీకాల్ కోసం పార్లమెంటుకు సిఫార్సు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. 65 రోజుల గైర్హాజరీపై నోటీసులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
తెలంగాణలో అనర్హత వేటు సాధ్యమేనా?
కేసీఆర్ లాంటి కీలక నేతపై అనర్హత వేటు వేయడం అంత సులభమైన విషయం కాదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కే అది రాజకీయంగా సానుభూతి కోసం వాడుకోవడానికి ఆయనకు అవకాశం ఇస్తుంది. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో సానుభూతి పెంచవచ్చు. కేసీఆర్ తన గైర్హాజరీకి సంబంధించి ఆరోగ్య కారణాలనో లేదా ఇతర కారణాలనో చూపుతూ స్పీకర్కు లేఖ రాస్తే, ఈ 60 రోజుల నిబంధన వర్తించదు. సాధారణంగా స్పీకర్లు ఇటువంటి సందర్భాల్లో నోటీసులు జారీ చేసి వివరణ కోరుతారు తప్ప, నేరుగా అనర్హత వేటు వేయడం చాలా అరుదు.
వ్యూహాత్మక మౌనం
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి కేసీఆర్ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తోంది. సభకు రాకుండా జీతం తీసుకుంటున్నారు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపీలో లాగే ఇక్కడ కూడా స్పీకర్ ద్వారా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది కానీ, తక్షణమే అనర్హత వేటు వేసేంత సాహసం చేసే అవకాశం తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ సభకు రాకపోవడం వల్ల నష్టపోయేది ఆయనేనని, ప్రభుత్వం వైపు నుంచి ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే విమర్శ రాకుండా చూసుకోవడమే రేవంత్ వ్యూహమని చెబుతున్నారు.
