Andhra Politics :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిరకంగా మారాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ విముక్త ఏపీ కోసం కలసి వచ్చే పార్టీలను ఒప్పిస్తామని ప్రకటించారు. ఆయన ఉద్దేశంలో ఒప్పించాల్సిన పార్టీ బీజేపీ ఒక్కటే. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలంటే బీజేపీ కూడా కూటమిలో ఉండాలని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ బీజేపీని ఒప్పిస్తామని చెబుతున్నారు. అయితే బీజేపీ ఇప్పటి వరకూ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి పొత్తులకు అనుకూలం.. మరొకటి వ్యతిరేకం. పొత్తులుంటే సీట్లు వస్తాయనుకున్న  వారు అనుకూలం. సీట్లు రావనుకున్న వారు వ్యతిరేకం అన్న భావనలో ఉన్నారు. మరి బీజేపీ హైకమాండ్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ?


కేంద్ర రాజకయాలతో ఏపీ రాజకీయలకు లింక్ !


ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలంటే కేంద్ర రాజకీయాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో పొత్తులు పెట్టకోవడం అనేది కేవలం.. ఏపీ రాజకీయాల మీద ఆధారపడి లేదు. కేంద్రంలో పరిణామాల్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో పొత్తులు ఉన్నాలేకపోయినా బీజేపీకి వచ్చే సీట్లు పెద్దగా ఉండవు. కానీ కేంద్రంలో మాత్రం ఇక్కడ గెలిచే ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీలు మద్దతుగా ఉండాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ ఆలోచిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి బీజేపీ ఏపీ పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


కర్ణాటకలో  ప్రతికూల ఫలితం వస్తే బీజేపీ జాగ్రత్త పడే చాన్స్ !


దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. అక్కడ ఓడిపోతే సెంటిమెంట్ దెబ్బతింటుంది. గెలవకపోతే ఆ ఎఫెక్ట్ తెలంగాణ ఎన్నికల్లోనూ పడుతుంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని బీజేపీ అనుకుంటోంది. కానీ లీడర్ల కొరత ఎక్కువగా ఉంది.  అదే కర్ణాటకలో గెలిస్తే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రతికూల ఫలితం వస్తే మాత్రం.. బీజేపీ నిరాశపడుతుంది. కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. అలాంటి సమయంలో బీజేపీ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ..  కూటమిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. 


ఉత్తరాదిలో సీట్లు తగ్గితే కూటమే ఆదుకోవాలి !


బీజేపీకి ఉత్తరాదిలో గత రెండు సార్లు తిరుగులేని మెజార్టీ వచ్చింది.  ఈ సారి అలాంటి ఫలితాలు కష్టమే. ప్రతీ సారి అదే ఫలితాల ఆశించడం అత్యాశే. బీజేపీకి అక్కడ తగ్గే సీట్లు దక్షిణాదిలో కవర్ చేసుకోవాలి. బీజేపీ ఎలాగూ గెలవదు. మిత్రపక్షాల ద్వారానే సర్దుబాటు చేసుకోవాలి. అలాంటి మిత్రపక్ష పార్టీల్లో బీజేపీకి కనిపించే మొదటి పార్టీ టీడీపీ. ఎందుకంటే గతంలో బీజేపీతో చాలాసార్లు కలిసింది. ఎంత సహకరిస్తున్నా వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు. అలా పెట్టుకుంటే వైసీపీ కోర్ ఓటు బ్యాంక్ దూరం అవుతుంది. నేరుగా కాకుండా పరోక్షంగా బీజేపీతోనే ఉంటామని వైసీపీ భరోసా ఇస్తుంది. కానీ టీడీపీ నేరుగా కలుస్తుంది. బీజేపీ ఎవర్ని నమ్ముతుందన్నది ఇక్కడ కీలకం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి నేరుగా కూటమిలో ఉండే పార్టీతో ఉండాలా.. లేకపోతే పరోక్షంగా మద్దతు ఇచ్చే పార్టీతో ఉండాలా అన్నది బీజేపీ తేల్చుకునే అవకాశం ఉంది. 


ఒక వేళ మధ్యేమార్గంగా వ్యవహరించి తటస్థంగా ఉండే..  రెండు పార్టీలు బీజేపీకే సపోర్ట్ చేస్తాయి.. కేంద్రంలో.  మరిబీజేపీ ఏ ఆప్షన్ ఎంచుకుంటుందో ?