గడచిన పదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ....హైద‌రాబాద్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మేడ్చ‌ల్, ఎల్‌బీన‌గ‌ర్‌, ఉప్ప‌ల్, కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గాలు మినీ భార‌త‌దేశాలు.. ఇక్క‌డ అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌ల‌తో పాటు మ‌న రాష్ట్రంలోని ప్ర‌జ‌లు కూడా ఉంటారు అని కేసీఆర్ తెలిపారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు 26 వేల వ‌చ్చాయ‌ని ఇప్పుడే మ‌ల్లారెడ్డి చెప్పార‌ని కేసీఆర్ తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇండ్ల‌ను అందించాం. ఇటీవ‌లే ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రామీస్ చేశాం. మ‌రో ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌డుతాం. బ్ర‌హ్మాండ‌మైన ప‌ద్ద‌తుల్లో 10 ఏండ్ల‌లోనే ఎంతో అభివృద్ధి సాధించాం. ఇది కొన‌సాగాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.


క‌రెంట్ ట్రాన్స్‌ఫార్మ‌ర్లు కాలిపోతుంటే, రైతులు ఏడుస్తుంటే మ‌న‌ల్ని ఎవ‌రు ప‌ట్టించుకోలేద‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఈ రోజు కాళేశ్వ‌రం పూర్తి చేసుకున్నాం. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌, సీతారామ ఎత్తిపోత‌ల పూర్త‌వుతున్నాయి. సాగునీళ్లు తెచ్చుకుంటున్నాం. మంచినీళ్ల బాధ కూడా పోయింది. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంచినీళ్ల ఏర్పాటు చేసుకున్నాం. ఎల్‌బీన‌గ‌ర్‌, మేడ్చ‌ల్, ఉప్ప‌ల్, కుత్బుల్లాపూర్ మినీ బార‌త‌దేశాలు. ఇక్క‌డ అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉన్నారు. మ‌న రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా నివాసం ఉంటున్నారు. ఏడాదికి ఏడాదికి న‌గ‌రం పెరిగిపోతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు, గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు పెంచుతాం. సెప‌రేట్ బ‌డ్జెట్ పెట్టి చ‌ర్య‌లు తీసుకుంటాం. మంచినీళ్లు, సీవ‌రేజ్, క‌రెంట్ వ‌స‌తులు పెరుగుతూ పోవాలి. అభివృద్ధి జ‌ర‌గాలి. గొప్ప నగ‌రంగా ఉంటుంది. మ‌ల్లారెడ్డి కోరిన నిధులు అంద‌జేస్తానని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.


ఇక ఆప‌ద మొక్కులు మొక్కే నాయ‌కులు వ‌స్తారు.. ఇష్ట‌మొచ్చిన మాట‌లు మాట్లాడుతారు.. వాగ్దానాలు చేస్తారు అని కేసీఆర్ విమ‌ర్శించారు. ఎవ‌రు మ‌న‌ల్ని ముంచారు. ఉన్న తెలంగాణ‌ను ఊరడ‌గొట్టిందేవ‌రు..? 50 ఏండ్లు మ‌న‌ల్ని రాచి రంపాన పెట్టిందేవ‌రు..? మ‌నం తిరుగుబాటు చేసిన నాడు తెలంగాణ బిడ్డ‌ల్ని కాల్చి చంపిందేవ‌రు..? కాంగ్రెస్‌కు ఓటేస్తే క‌రెంట్ బాధ‌లు వ‌స్తాయి. ప‌రిశ్ర‌మ‌లు దెబ్బ‌తింటాయి. అంద‌రికీ మేలు చేసే బీఆర్ఎస్ పార్టీకి అండ‌దంగా ఉండాలి. ఆప‌ద‌మొక్కులు మొక్కే వారు వ‌స్త‌రు. వారిని న‌మ్మొద్ద‌ని కేసీఆర్ కోరారు.


తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కేంద్రానికి తలొగ్గి.. తలకాయలు గంగిరెద్దుల్లా ఊపితే 58ఏళ్లు గోసపడ్డామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటుకాకపోతే.. పోరాటమే చేయకపోతే రాష్ట్రం వచ్చేది కాది. నేను ఒక్కటే మనవి చేస్తున్నా. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉండే ఓటర్లు, కార్యకర్తలు చైతన్యవంతులు. రాజకీయాలను అనునిత్యం గమనిస్తుంటారు. 20-22 ఏళ్ల కిందట ఉద్యమం ప్రారంభించిననాడు అందరూ నవ్వులాటగా చూశారు. తెలంగాణ అయ్యేదా? జరిగేదా? అని మాట్లాడారు’ అని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. 


ఆ రోజు వరకు దిక్కులేని స్థితిలో.. రాజకీయ భిక్షగాళ్లలాగా.. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పదవులు, పైరవీల కోసం ఎదురుచూశారు. ఈ రోజు అందరికీ గుర్తుండే ఉంటుంది. నాపై ఎంత నిందలు పెట్టారు? ఎన్ని రకాల అవహేళనలు చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్‌, ఇతర పార్టీల వారు నేను పోరాటం చేస్తున్నా కలిసిరాకపోగా అవహేళనలు చేశారు. వాటిని దిగమింగుకుంటూ.. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ 15ఏళ్లు పోరాటం చేశాం. దాని ఫలితం తెలంగాణ రాష్ట్రం రావడం.. వచ్చిన రాష్ట్రం ఎలా ముందుకువెళ్తుందో మీరు అందరూ గమనిస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.