Telangana politics revolves around Musi river : హైదరాబాద్‌ నగరంలో పారే మూసి నది మురికి కాలువలా మారిపోయి చాలా కాలం అయింది. రివర్ బెద్ మీద ఇళ్లే కాదు కాలనీలు కూడా వెలిశాయి. ఇలాంటి సమయంలో చాలా ప్రభుత్వాలు మూసి నదీని ప్రక్షాళన చేసి ముంపును తగ్గించాలని..  రివర్ సిటీగా తెలంగాణను మార్చాలని చాలా సార్లు అనుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనుకుంది. అందు కోసం బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంది. కానీ అడుగు ముందుకు వేయలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ కంటే భారీ ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదంటోంది. 


మూసీ ఆక్రమణలను తొలిగించే ప్రక్రియ చేపట్టిన రేవంత్ సర్కార్ 


రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత మూసీ సుందీరకరణ చేయాలని అనుకున్నారు. ఆక్రమణలు తొలగించడమే కాదు..మూసి చుట్టూ  ఓ ఆర్థిక పరమైన సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకున్నారు. అందు కోసం భారీ ప్రణాళికలు వేసుకున్నారు. ఇందుకు లక్షన్నర కోట్లు అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలే చెప్పారు. అయితే చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇదో పెద్ద స్కామ్ అంటున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆక్రమణలు తీసేయడానికి మార్కింగ్ చేసింది. అక్కడ ఉన్న వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిచింది. వాటిని తీసుకుని మూసి నుంచి వెళ్లిపోయిన వారి ఇళ్లను.. ఆ ఇంటి యజమానులతోనే తొలగింప చేస్తున్నారు. అయితే వీటిని కూల్చివేతలు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 


ఉద్దేశం మంచిదే అయినా దూకుడే అసలు సమస్య - హైడ్రా డ్యామేజీని రేవంత్ ఎలా కవర్ చేసుకుంటారు ?


మూసి ఆక్రమణల్ని తొలగిస్తే యుద్ధమేనని కేటీఆర్ హెచ్చరికలు


అయితే మూసీ నదిలో ఉన్న ఆక్రమణలన్నీ పేదలవేనని వాటిని తొలగిస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ ప్రకటించారు. రెండు రోజుల పాటు మూసి రివర్ బెడ్ మీద నిర్మించిన కాలనీల్లో పర్యటించారు. అందరూ ఇళ్లపై కేసీఆర్ అని రాసుకోవాలని ఎవరు ఇల్లు కూలగొడతారో చూస్తామని సవాల్ చేశారు. నిజానికి మూసి ఆక్రమణల్ని హైడ్రా కూల్చివేస్తుందని ప్రచారం జరిగింది.కానీ మూసీ నిర్వాసితులకు ఇచ్చిన నోటీసులతో కానీ సర్వేలతో కానీ హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. కూల్చి వేతల్ని  నిర్వాసితులు అందరూ కలిసి అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 


గతంలోనే సుందరీకరణ ప్లాన్ చేసిన బీఆర్ఎస్ సర్కార్


తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ ప్లాన్ చేశారు.   2021లో మూసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమావేశాలు నిర్వహించి... మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ ను నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.  బీఆర్ఎస్ హయాంలోనే మూసీ సరిహద్దులను ఫిక్స్ చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం ఏమిటని కాంగ్రెస్ మండి పడుతోంది. ఆక్రమణల్ని సమర్థించడం ఏ ప్రతిపక్షానికైనా మంచిది కాదని.. మూసీ నదిపై బీఆర్ఎస్ ఫిక్స్ చేసిన బఫర్ జోన్ మేరకే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. 


హైడ్రా మిస్ ఫైర్ అవుతుందా? ఈ వ్యవస్థతో కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభమా! నష్టమా!


రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికే బీఆర్ఎస్ఇలా చేస్తోందని వారు మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఈ సమయానికల్లా ఎలాంటి పరిహారం కూడా ఇవ్వకుండా పేదల్ని పంపించేసేవారని..ఇళ్లుకూలగొట్టేసేవారని కాంగ్రెస్ నేతలంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ తన వాదన వినిపించాల్సి ఉంది.