Telangana Municipal Elections 2026: గల్లీ ఎన్నికల్లో డిజిటల్ దండయాత్ర - ఇన్ఫ్లుయెన్సర్ల చేతుల్లో ఓటరు నాడి!
Telangana Municipal Elections:: ఎన్నికలు ఏవైనా సోషల్ మీడియా ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఇన్ ఫ్లూయన్సర్లను రాజకీయ నేతలు వాడుకుంటున్నారు.

Local influencers on social media are campaigning for municipal elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు కేవలం గల్లీల్లో తిరుగుతూ ఓట్లు అడిగే సంప్రదాయంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాను వాడేస్తున్నారు స్థానిక నేతలు. ప్రతి ఓటరు చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ గా, ప్రతి వాట్సాప్ గ్రూపు ఒక ప్రచార సభ గా మారిపోయింది. ఈ డిజిటల్ విప్లవం స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త పోకడలను తీసుకువస్తోంది. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే మైకుల హోరు, గోడ పత్రికల హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు అభ్యర్థులు తమ వార్డు పరిధిలో పాపులర్ అయిన లోకల్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఆధారపడుతున్నారు. మన వార్డు అభ్యర్థి.. మన మనిషి అంటూ సాగే 60 సెకన్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓటర్లపై బలమైన ముద్ర వేస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి సినిమా పాటల పేరడీలు, మాస్ డైలాగులతో అభ్యర్థులు తమను తాము హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.
వాట్సాప్ వార్ రూమ్స్ - క్షణాల్లో వైరల్
ప్రతి వార్డుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు వెలిశాయి. అభ్యర్థులు డిజిటల్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని పెయిడ్ వాలంటీర్ల ద్వారా నిరంతరం మెసేజ్లు పంపిస్తున్నారు. వార్డులోని డ్రైనేజీ సమస్యలు, రోడ్ల పరిస్థితిపై ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ గ్రాఫిక్ కార్డ్స్, షార్ట్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇది ఎంత వేగంగా జరుగుతోందంటే, ప్రత్యర్థి ఒక విమర్శ చేసేలోపే దానికి కౌంటర్ వీడియో గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. ఈ ఎన్నికల్లో 'ట్రోలింగ్' అతిపెద్ద ఆయుధంగా మారింది. ప్రత్యర్థి అభ్యర్థి గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చని వీడియోలను వెలికితీసి మీమ్స్ రూపంలో ప్రచారం చేస్తున్నారు. నాడు అలా.. నేడు ఇలా అంటూ అభ్యర్థుల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టడం ఓటర్లలో గందరగోళాన్ని, చర్చను రేపుతోంది. వ్యక్తిగత విమర్శలు, మార్ఫింగ్ ఫోటోలు కూడా ఈ డిజిటల్ పోరులో భాగం కావడం ఆందోళన కలిగిస్తోంది.
స్మార్ట్ ఫోన్ ఓటరు - మారుతున్న తీర్పు
ఒకప్పుడు ఎన్నికల ముందు ఇచ్చే మద్యం, డబ్బు నాడిని నిర్ణయించేవి. కానీ ఇప్పుడు డిజిటల్ ప్రచారం ఓటరు ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోంది. స్మార్ట్ఫోన్ చూస్తూ అభ్యర్థి వ్యక్తిత్వం, సామాజిక స్పందనను ఓటరు బేరీజు వేసుకుంటున్నాడు. ముఖ్యంగా అర్బన్ ఓటరు టీవీ వార్తల కంటే సోషల్ మీడియాలో వచ్చే వైరల్ కంటెంట్నే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది సంప్రదాయ పార్టీల కంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు, చిన్న పార్టీలకు కలిసి వచ్చే అంశం.
లోకల్ పోల్స్లోనూ తప్పని ఫేక్ న్యూస్ బెడద
డిజిటల్ వార్లో ఉన్న ప్రధాన లోపం ఫేక్ న్యూస్ . ప్రత్యర్థిపై బురద చల్లడానికి తప్పుడు వార్తలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం సోషల్ మీడియాపై నిఘా పెంచినా, లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో జరిగే ప్రచారాన్ని అడ్డుకోవడం సవాల్గా మారింది. అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులో దాదాపు 30-40 శాతం కేవలం డిజిటల్ మార్కెటింగ్ ,సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసమే వెచ్చిస్తుండటం ఈ డిజిటల్ దండయాత్ర తీవ్రతకు అద్దం పడుతోంది. గల్లీలో గెలవాలంటే ఇప్పుడు కేవలం గుమ్మం తొక్కితే సరిపోదు.. ఓటరు ఫోన్ స్క్రీన్పై నిరంతరం కనిపిస్తూ ఉండాలి. ఈ వైరల్ రాజకీయం ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేస్తుందో చూడాలి.























