Telangana politics  :   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకు రావడం లేదు. రెండు జిల్లాల్లో పర్యటించి బహిరంగసభల్లో ప్రసంగించారు. ఆయన కాంగ్రెస్ సంగతి చూద్దామన్నారు కానీ బీజేపీని పల్తెత్తు మాట అనలేదు. దీంతో బీజేపీ నేతలు ఫీలవుతున్నారు. కేసీఆర్ కుట్ర చేస్తున్నారని గొణుక్కుంటున్నారు. కానీ పైకి ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే.. బీజేపీని కేసీఆర్ ప్రత్యర్థిగా భావించడం లేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతోంది. అలా అయితే ప్రత్యామ్నాయంగా గుర్తించి ఎలా ఓట్లు వేస్తారని బీజేపీ నేతల ఆందోళన. అసలు కేసీఆర్ విమర్శించకపోవడానికి కారణం ఏమిటి ? బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బకొడుతున్నారా లేక ఢిల్లీ బీజేపీతో సఖ్యత కోసం ఇలా చేస్తున్నారా ?  


ఇప్పటి వరకూ బీజేపీని ప్రత్యర్థిగా ఎంచుకున్న కేసీఆర్ 


తెలంగాణలో బీజేపీకి బాగా హైప్ రావడానికి ప్రధాన కారణం కేసీఆర్. ఆయన కాంగ్రెస్ ను అసలు పట్టించుకోవడం మానేసి..  బీజేపీనే టార్గెట్ చేయడం వల్ల.. తెలంగాణలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అనే భావన ఎక్కువ ఎక్కువగా పంపించారు. ఉపఎన్నికల్లో.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నూ బీజేపీనే టార్గెట్ చేశారు. ఫలితంగా బీజేపీ.. బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతున్న వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ మూడో పక్షంగా మారిపోయింది. రెండు పార్టీలు హోరాహోరీ తలపడుతూంటే.. కాంగ్రెస్ ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అందుకే  బీజేపీ ఎదుగుదలలో కేసీఆర్ పాత్ర ఉందని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. 


బీజేపీపై కేసీఆర్ మౌనవ్రతం !  


నిన్నటిదాకా బీజేపీతో పోటీ అన్నట్లుగా ప్రకటనలు చేసిన కేసీఆర్  , కేటీఆర్ ఇప్పుడు  సందర్భం ఏదైనా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీపై యుద్ధం ప్రకటించి హఠాత్తుగా ఎందుకు అస్త్ర సన్యాసం చేశారు. బీజేపీని విమర్శించడం లేదు. ఆ పార్టీని పల్తెత్తు మాట అనడం లేదు. మోదీ విధానాలను చీల్చిచెండాడిన కేసీఆర్ ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు.  ఈ కారణంగానే బీజేపీకి  టెన్షన్ ప్రారంభమయింది. కేసీఆర్ పాటిస్తున్న మౌనంతో తమపై అటెన్షన్ తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నారు. 


బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయనే ప్రచారం 
 
లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకుండా ఒప్పందం జరిగిపోయిందని విస్తృత ప్రచారం జరుగుతోంది. అదే సమయానికి కవిత విషయంలో   ఈడీ, సీబీఐ దూకుడు తగ్గించుకున్నాయి. దీంతో నిజంగానే ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఉందన్న అభిప్రాయానికి  ప్రజలు వస్తున్నారు. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత కేసీఆర్ అంటూ కవిత  ప్రకటించడంతో.. ఏదో జరిగిందని అందరూ క్లారిటీకి వచ్చారు. అయిేత  కేసీఆర్ పట్టించుకోకపోవడంతో డీలాపడిపోయింది..  బీజేపీ. ఓ వైపు బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందాలని ప్రచారం..మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ విమర్శలు చేస్తూండటంతో చేరికలు కూడా లేకుండా పోయింది. కారణం ఏదైనా కేసీఆర్‌కు  పోయేదేమీ లేదు. కానీ బీజేపీకి మాత్రం ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోతోంది. 


వ్యూహాత్మకంగా బీజేపీని కేసీఆర్ దెబ్బకొట్టేశారా ?


నిజానికి బీజేపీని విమర్శిస్తేనే రాజకీయం చేసినట్లు కాదు.. విమర్శించకుండా కూడా తీవ్రంగా దెబ్బకొట్టవచ్చు. కేసీఆర్ రాజకీయానికి బీజేపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ తమపై నోరు తెరకపోవడానికి కారణాలేమిటో బీజేపీ కూడా చెప్పలేకపోతోంది. గందరగోళంలో పడిపోయింది.